Capital Amaravathi : హైదారాబాద్ కి దీటుగా అమరావతి నిర్మించాలని సంకల్పించామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. “అమరావతి ఎక్కడికి వెళ్లదు, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలో వస్తుంది, వెంటనే పనులు పెట్టిస్తామని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. వైసీపీ పాలన ముగిసే టైం దగ్గర పడిందని పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.
ఏమిటీ చంద్రబాబు ధీమా..
ఏపీలో గడిచిన మూడున్నరేళ్లుగా రాజధాని విషయం కొలిక్కి రావడం లేదు. చంద్రబాబు హయాంలో 2015లో అమరావతిని రాజధానిగా చేస్తూ శంకుస్థాపన చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత.. ఏపీకి అత్యద్భుతమైన నగరంగా రాజధాని ఉండాలని చంద్రబాబు భావించారు. దానికి అనుగుణంగానే 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేకరించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగపూర్, దుబాయ్ దేశాలకు చెందిన కన్సల్టెన్సీలను కూడా రప్పించారు. ఇక, ఇక్కడే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టును కూడా నిర్మించారు.
పనులు పురోగమిస్తున్న తరుణంలో 2019లో వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి, వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక రాజధాని నిర్మాణం మరుగున పడిపోయింది. సీఎం జగన్ మూడు రాజధానుల పేరిట కొత్త రాగం అందుకున్నారు. విశాఖను రాజధాని చేస్తానని అక్కడే ఉంటానని కూడా ప్రకటించారు. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమ బాట పట్టారు. రాష్ర్టం విడిపోయి పదేళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకపోవడంతో ఇదేం పాలన అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో ఆందోళన చెందవద్దని బాబు ప్రకటించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కు ధీటుగా రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు. టీడీపీపై విశ్వాసంతో 29 వేల మంది రైతులు భూములిచ్చారని కార్యకర్తలు మరిచిపోవద్దనే గుర్తు చేస్తున్నారు. రాజధాని అంశమే మనల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు. మరి రానున్న ఎన్నికల్లో రాజధాని అంశం టీడీపీని ఏ మేరకు గట్టెక్కిస్తుందో చూడాలి.