Jai shreeram : దేశంలో మతం విపరీత పోకడలకు పోతోంది. మతం మంచి చేయాలి తప్ప ఉన్మాదానికి దారితీయకూడదు. ఇది ఏ మతానికైనా వర్తిస్తుంది. ప్రజల్లో మంచితనం, సోదరభావం, నిజాయితీ, దాతృత్వం వంటి గుణాలను పెంచేందుకు ఏ మతమైన కృషి చేయాలి కానీ..మత పక్షపాతం ఎన్నడూ పనికిరాదు. ఒక దేశం ఎప్పుడూ లౌకికంగానే ఉండాలి. అంతే తప్ప ఏదో ఒక మతానికి ప్రాధాన్యం ఇస్తే పాకిస్తాన్ లా తయారవుతుంది. భారత్ కు, పాకిస్తాన్ కు ఉన్న తేడా ఇదే. భారత్ లౌకిక దేశంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. పాక్ నానాటికీ అన్ని రంగాల్లో దిగజారిపోతోంది. అన్ని మతాల ప్రజలు అన్నాదమ్ముళ్ల కలిసి పోయి పనిచేస్తేనే ఏ దేశమైన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది. అయితే భారత్ లో ప్రస్తుతం ఓ రకమైన వ్యత్యాస ధోరణి కనిపిస్తోంది. సమాజం రెండు వర్గాలుగా చీలిపోతున్నట్లు కనిపిస్తోంది.
అందుకు నిదర్శనంగా ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటనను చెప్పుకోవచ్చు. ఇంటర్ పరీక్షల్లో ఆన్సర్ షీట్ లో ‘జైశ్రీరామ్ ’ అని రాసినందుకు కొందరు విద్యార్థులను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు అక్కడి ప్రొఫెసర్లు. యూపీలోని జౌన్ పూర్ లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వంచల్ యూనివర్సిటీ నిర్వహించే ప్లస్ 2 పరీక్షలు ఇటీవలే ముగిశాయి. ఈ పరీక్షలో కొందరు విద్యార్థులు జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ ముజే పాస్ కరో అంటూ రాసుకొచ్చారు. అలాగే హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కొందరు క్రికెటర్ల పేర్లను కూడా జవాబు పత్రాల్లో రాశారు.
ఆ విద్యార్థులందరూ కూడా 60 శాతం మార్కులతో పాసయ్యారు. పాస్ అవ్వడం కష్టమని భావించే ఆ విద్యార్థులు 60శాతం మార్కులతో పాస్ కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ దివ్యాంషు సింగ్.. ప్రధాని మోదీ, సీఎం యోగి, గవర్నర్, వీసీలకు లేఖలు రాసి రివాల్యూయేషన్ చేయాలని కోరారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వీసీ వందనా సింగ్ ధ్రువీకరించారు. ఆ విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే ఎక్కువ వచ్చాయని అన్నారు. దీనికి కారణమైన ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ శర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చేశారు.