Ponnam Prabhakar : ఆగస్లు 15 లోపు రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. అలాగే వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 బోనస్ ఇస్తామని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లోని శుభం గార్డెన్స్ లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు.కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గ అభివద్ధికి ఏమైనా చేశాడా.. ఏనాడైనా గ్రామంలో తిరిగాడా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వాళ్ల పార్టీ నేతలతో కూడా చేయి కలపరని విమర్శించారు. తాను ఎంపీగా ఏం చేశానో.. బండి సంజయ్, వినోద్ కుమార్ లు ఎంపీలుగా ఏంచేశారో చర్చిద్దామని సవాల్ చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, హుస్నాబాద్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.