'Chandranna' surrounded on all four sides.. Can Jagan get out :
ఏపీలో రాజకీయ పార్టీల లెక్క తేలింది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలన్నీ ఏకమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే చంద్రబాబు.. పవన్.. లోకేశ్..బీజేపీ కలిసి జగన్ ను చుట్టుముట్టినట్లుగా కనిపిస్తున్నది. ఇక ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లే. సీఎం జగన్ వీరి వ్యూహాలను చేధించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది.
ఇప్పటికే టీడీపీ యువనేత లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని పాదయాత్ర చేస్తున్నారు. నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు జనసేనాని వారాహి యాత్ర బుధవారం ప్రారంభమైంది. ఇక కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన నేటి నుంచి ప్రారంభం కాబోతున్నది. మరోవైపు బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ఏపీకి వచ్చి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అమిత్ షా, జేపీ నడ్డా జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బీజేపీ మద్దతు తనకు లేకపోవచ్చని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. అధికారికంగా ప్రకటన రాకపోయినా బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేనాని కూడా టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే అమిత్ షా ఖమ్మం పర్యటన రేపు ఉంది. ఇందులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన నివాళి అర్పించబోతున్నారు. అంటే పొత్తులపై ఆయన స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతున్నారని అర్థమవుతున్నది.
అయితే తెలుగు రాష్ర్టాల్లో కరుడుగట్టిన రాజకీయ నేత ఎవరంటే ముందుగా చంద్రబాబు పేరే చెబుతారు. వచ్చే ఎన్నికల్లో గెలిచాకే అసెంబ్లీలో అడుగుపెడుతానని ఆయన శపథం చేశారు. టీడీపీ కి వచ్చే ఎన్నికలకు నవ్ ఆర్ నెవర్ అని తేల్చి చెప్పారు. ఇందుకోసం బీజేపీతో కలవడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. అయితే నలుగురు నాలుగు వైపుల నుంచి సీఎం జగన్ ను చుట్టుముట్టేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఇప్పుడు సీఎం జగన్ ఒక వైపు.. ఆ నలుగురు ఒకవైపు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఆయన మాత్రం తాను సింగిల్ కాదని, తన వెంట ప్రజలు ఉన్నారని పదేపదే చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మాత్రమే తాము జట్టుగా వెళ్తున్నట్లు వీరంతా చెబుతుంటే, జగన్ మాత్రం తన ఒక్కడిని ఢీకొట్టేందుకు దుష్టచతుష్టయం పని చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. మరి ఈ రోజు నుంచి ప్రచారం వేడెక్కనుండగా, జగన్ నుంచి ఆ స్థాయి కౌంటర్ వస్తుందా.. ఆయన ఏస్థాయి వ్యూహాలతో ముందుకెళ్తారో వేచి చూడాలి. మరి రాజకీయాల్లో సీనియర్ చంద్రన్న పన్నిన వ్యూహాన్ని దాటేందుకు ఆయన ఏం చేస్తారనేది ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి సపోర్ట్ ఉన్నట్లు కనిపిస్తున్నా, బీజేపీ పార్టీ పరంగా ముందుకెళ్తే ఇక జగన్ కు కష్టమే అని టాక్.