TDP టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం పుంగనూరు పర్యటనలో జరిగిన వ్యవహారంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి తీరు విమర్శలకు దారితీస్తున్నది. ఆయన వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతూ తమ నాయకులపై లాఠీచార్జి చేయించారని టీడీపీ ఆరోపిస్తున్నది. దాడుల అనంతరం ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే వైసీపీతో కలిసి పోలీసులే చంద్రబాబు కాన్వాయ్ పై దాడులకు కుట్ర చేశారని అనుమానాలు టీడీపీ వ్యక్తం చేస్తున్నది.
అయితే మరోవైపు ఎస్పీ మాట్లాడుతూ టీడీపీ నేతల తీరు వల్లే ఘర్షణ వాతావరణం తలెత్తిందని చెప్పుకొచ్చారు. అయితే నిజానికి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని అంగళ్లు అనే గ్రామం వద్ద టీడీపీ నేతలపై చాలా సార్లు దాడులు జరిగాయి. అలాంటి సున్నితమైన చోట రాళ్లు రాళ్లు కర్రలతో వందల మంది కార్యకర్తలు చంద్రబాబు వచ్చే ముందు చేరుకున్నారు
అయితే ఇది కేవలం నిరసనలో భాగంగానే వచ్చారని ఎస్పీ మాట్లాడడం విమర్శలకు తావిస్తున్నది. చంద్రబాబు తంగళ్లపల్లి ఎమ్మెల్యేను రావణ అనడంతోనే ఈ నిరసన వ్యక్తం అయిందని ఆయన మాట్లాడారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పోలీసులు తీరుపై మండిపడ్డారు. పోలీసులు సహకరించడంతోనే వైసీపీ నేతలు ఇక్కడ వరకు రాగలిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కదిద్దకుంటే తమ కార్యకర్తలను పంపిస్తానని చెప్పానని పేర్కొన్నారు. పోలీసులే పట్టించుకుంటే ఇక్కడి వరకు రాకపోయేదని డీఎస్పీ వ్యవహరశైలిఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో చాలామంది పోలీసులు గాయపడ్డారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి వ్యవహారం వల్లే పోలీసులకు గాయాలైనట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు పర్యటనలను అడ్డుకోవడంలో భాగంగా వైసీపీ నేతలు ఈ దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటన కు ముందే వజ్రవాహనాన్ని తీసుకొచ్చి అందుబాటులో పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లర్లు జరుగుతాయని పోలీసులు ముందస్తుగా రబ్బరు బుల్లెట్లు, వజ్రవాహనంతో వచ్చారని ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందని అటు పోలీసులు అంటుంటే.. ఇటు టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ, పోలీసుల పక్కా ప్లాన్ అంటూ ఆరోపిస్తున్నది. ఏదేమైనా పుంగనూరు ఘటనలో పోలీసులతో పాటు కార్యకర్తలు చాలా వరకు గాయాలపాలయ్యారు. ఇరువర్గాలు సంయమనంతో ఉండాలని పోలీసులు కోరుతున్నారు. కానీ ఎస్పీ రిషాంత్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లు చేస్తున్నారని, అందుకే దాడులు జరిగాయని టీడీపీ ఆరోపిస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నేరుగా ఎస్పీ పై విమర్శలకు దిగారు. ఏదేమైనా జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న ఓ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు సరైన భద్రత కల్పించడం లేదని, ఎన్ఎస్ జీ కమాండోలు అప్రమత్తంగా ఉండడం వల్లే పలుమార్లు దాడుల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.