Multiple sclerosis : జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మన పూర్వీకులను రక్షించిన జన్యువులు ఇప్పుడు మల్టిపుల్ స్ల్కెరోసిస్ (ఎంఎస్) వ్యాధి ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఈ వ్యాధి పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడంలో తాజా ఆవిష్కరణ ఒక పెద్ద పురోగతి అని పరిశోధకులు అభివర్ణించారు. ఇది ఎంఎస్ వ్యాధి కారకాలపై అభిప్రాయాన్ని మార్చగలదని, దాని చికిత్సపై ప్రభావం చూపగలదని చెబుతున్నారు.
మల్టిపుల్ స్ల్కెరోసిస్ అంటే ఏంటి?
మల్టిపుల్ స్ల్కెరోసిస్ కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధిలో మెదడు, ఆప్టిక్ నర్వ్, వెన్నుపాములోని నరాల రక్షక కవచం మీద శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. దీనివల్ల నడవడం, మాట్లాడడంలో సమస్యలు వస్తాయి. కండరాలు బిగుసుకుపోవడం జరుగుతుంది. దీని తీవ్రత ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
దక్షిణ యూరప్తో పోల్చితే యూకే, స్కాండినేవియాతో సహా వాయువ్య యూరప్లో ఎంఎస్ కేసులు రెండింతలు అధికం. దీనికి కారణం తెలుసుకునేందుకు కేంబ్రిడ్జి, కోపెన్ హాగన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల పరిశోధకులు పదేళ్లపాటు పరిశోధనలు చేశారు. ఎంఎస్ వ్యాధి ముప్పును పెంచే జన్యువులు ఐదు వేల ఏళ్ల క్రితం వాయువ్య యూరప్లోకి ప్రవేశించాయని పరిశోధకులు కనిపెట్టారు.
‘యమ్నాయా’ అనే పశువుల కాపరుల వలసలు భారీగా పెరగడంతో జన్యువులు వాయువ్య యూరప్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. పశ్చిమ రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్ నుంచి యమ్నాయా ప్రజలు పశ్చిమ యూరప్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశంపైనే నేచర్ మ్యాగజీన్ వరుస కథనాలు ప్రకటించింది.
ఈ పరిశోధన ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పురాతన డీఎన్ఏ విశ్లేషణ నిపుణుడు, రచయిత డాక్టర్ విలియం బారీ తెలిపారు. ఆ సమయంలో కాపరులలో జన్యు వైవిద్యాలు తమ గొర్రెలు, పశువుల నుంచి వ్యాధులు సోకకుండా రక్షణ కల్పించాయి. ఇప్పుడు ఆధునిక జీవనశైలి, ఆహార పద్ధతులు, మెరుగైన పరిశుభ్రతతో ఈ జన్యు వైవిధ్యాల పాత్ర మారిపోయింది. ఇప్పుడు ఇవే లక్షణాలు మల్టిపుల్ ‘స్ల్కెరోసిస్’ వంటి నిర్ధిష్ట వ్యాధులు ఏర్పడే ముప్పును భారీగా పెంచుతున్నాయి.
ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. యూరప్, పశ్చిమాసియాల్లో కనుగొన్న పురాతన మానవ అవశేషాల నుంచి సంగ్రహించిన జన్యు సమాచారాన్ని యూకేలో నివసిస్తున్న వేలాది మంది జన్యువులతో పోల్చి చూశారు. ఈ ప్రక్రియలో చాలా దేశాల్లోని మ్యూజియం కలెక్షన్లలో భద్రపరిచిన ఐదు వేల ప్రాచీన మానవుల డీఎన్ఏ బ్యాంకును ఇప్పుడు భవిష్యత్ పరిశోధనల కోసం ఏర్పాటు చేశారు.
‘స్వీట్ స్పాట్’
తాజా ఆవిష్కరణ ఎంఎస్ వ్యాధి రహస్యాలను తెలుసుకోవడంలో సహాయపడుతుందని ఆక్స్ఫర్డ్ జాన్ రాడ్క్లిఫ్ హాస్పిటల్ ఎంఎస్ డాక్టర్, పేపర్ రచయిత, ప్రొఫెసర్ లార్స్ ఫుగర్ అన్నారు. టీకాలు, యాంటి బయాటిక్స్, పరిశుభ్రత ప్రమాణాలు వ్యాధుల తీరును పూర్తిగా మార్చేశాయి. ఆధునిక రోగనిరోధక వ్యవస్థలు ఎంఎస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధి రావడానికి మరింత అనువుగా మారాయని పరిశోధనలు చెప్తున్నాయి.
ఇప్పుడు ఎంఎస్ వ్యాధి చికిత్సకు వాడుతున్న ఔషదాలు శరీర రోగ నిరోధక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇందులో ప్రతికూలత ఏంటంటే, రోగనిరోధక వ్యవస్థను అణచివేస్తే ఇన్ఫెక్షన్లపై పోరాడటంలో రోగులు ఇబ్బందిపడతారు. ‘రోగనిరోధక వ్యవస్థను తుడిచిపెట్టేలా కాకుండా సమతుల్యం చేసుకునే చికిత్సా పద్ధతిని కనిపెట్టాల్సిన అవసరం ఉంది’ అని ప్రొఫెసర్ ఫుగర్ చెప్పారు.
పురాతన డీఎన్ఏలోని ఇతర వ్యాధుల గురించి పరిశోధించాలని ఈ బృందం అనుకుంటోంది. వారి పరిశోధన ఆటిజం, ఏడీహెచ్డీ, డీప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి వ్యాధుల మూలాల మరింత బహిర్గతం చేస్తుంది. దక్షిణ యూరోపియన్ల కంటే వాయువ్య యూరోపియన్లు పొడవుగా ఉండేందుకు కూడా యామ్నాయా కాపరులకు సంబంధమనే ఆధారాలను నేచర్ మ్యాగజీన్ ప్రచురించింది.
జన్యువుల పరంగా ఉత్తర యూరోపియన్లకు ఎంఎస్ వ్యాధి వచ్చే ముప్పు అధికంగా ఉండగా, దక్షిణ యూరోపియన్లు బైపోలార్ డిజార్డర్ తో ఇబ్బంది పడే అవకాశం అధికం. తూర్పు యూరోపియన్లకు టైప్ 2 డయాబెటిక్, అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వేటగాళ్ల నుంచి వచ్చిన డీఎన్ఏతో అల్జీమర్స్ ముప్పు పెరుగుతుందని, పురాతన రైతుల జన్యువులకు ప్రవర్తనా రుగ్మతల (మూడ్ డిజార్డర్స్)కు సంబంధం ఉంటుందని పరిశోధన వివరిస్తుంది.
మానవులకు పాలు, పాల పదార్థాలు, కూరగాయలు జీర్ణం చేసుకునే సామర్థ్యం ఆరు వేల ఏళ్ల క్రితం నుంచే వచ్చిందని, అంతకు ముందు మాంసాన్నే తినేవారని వారు గుర్తించారు. యూరేషియాలో కనుగొన్న వేలాది పురాతన అస్థిపంజరాలు నుంచి ప్రస్తుత యూరోపియన్ల డీఎన్ఏలను ఈ పరిశోధనలో పోల్చి చూశారు.