Goda Kalyanam : కోదై లేదా ఆణ్డాళ్ లేదా గోదా కళ్యాణం ప్రతి ఏటా భోగి నాడు జరుగుతూంటుంది. దీనికి తమిళ్ష్నాట బోగి కళ్యాణం అన్న పేరు కూడా ఉంది. ఆగమ శాస్త్ర బద్ధం కాకపోయినా శ్రీరంగం, శ్రీవిల్లిపుత్తూరు ఆలయాల్లోనూ, ఇతర వైష్ణవాలయాల్లోనూ ఈ గోదా కళ్యాణాన్ని ఒక ఉత్సవంగా జరుపుతారు. భోగి నాటికి తిరుప్పావై ముప్పై పాసురాలు పూర్తవుతాయి. చివర పాసురమ్ పూర్తి, గోదా కళ్యాణం ఒకేనాడు జరుగుతాయి.
వైష్ణవ ఆలయాల్లో మూల విరాట్టుకు వాయువ్యంలో ఆణ్డాళ్ సన్నిధి ఉంటుంది. ఆణ్డాళ్కు తల కొప్పు ఎడమ వైపున ఉంటుంది. ఉన్నతమైనవాళ్లకు కొప్పు ఎడమ వైపున ఉండడం ఆనాటి ఆనవాలు, ఆనవాయితీ. ఆణ్డాళ్ ఒక ఉన్నతమైన లేదా మేలైన మహిళ. ఒక మేలైన మహిళ ఆణ్డాళ్ కళ్యాణం కూడా మేలైందే. గోదా కళ్యాణం గురించి ముచ్చటించుకుందాం రండి…
ఆణ్డాళ్, పెరియ ఆళ్ష్వార్ లేదా విష్ణుచిత్తుడికి తులసీ వనంలో దొరికిన శిశువు. తమిళ్ష్నాడులోని మదురైకు సమీపంలో ఉన్న శ్రీవిల్లిపుత్తూరు విష్ణుచిత్తుడి నివాసం.
పూమాలలు కట్టి శ్రీవిల్లిపుత్తూరు వటపత్రశాయి లేదా రంగమన్నార్ ఆలయానికి ఇవ్వడం పనిగా విష్ణుచిత్తుడు జీవిస్తూ ఉండేవాడు.
ఒకనాడు తోటలో పూలు కోసుకోవడానికి వెళ్లిన విష్ణుచిత్తుడికి అక్కడ ఒక ఆడ శిశువు దొరికింది. ఆ శిశువును తీసుకుని కోదై అని పేరు పెట్టి పెంచుకోసాగాడు.
బాల్య దశ దాటాక కోదై కృష్ణుడిపై ప్రేమతో పెరగసాగింది. అలవిలేని కృష్ణ ప్రేమతో కృష్ణుణ్ణే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను తనలో పెంచుకుంది కోదై. తన స్నేహితురాళ్లతో కృష్ణుడి ఊసులతోనూ, ఏకాంతంలో కృష్ణోహలతోనూ కాలం గడిపేది. తాను కృష్ణుడి వధువుగా భావించుకుంటూ తనకు కృష్ణుడితో పెళ్లి అయినట్టుగా కలగనేది. తన కలను ఇలా చెప్పుకుంది:
“వారణమాయిరమ్ సూళ్ష వలమ్ సెయ్దు
నారణన్ నమ్బి నడక్కిన్ఱాన్ ఎన్ఱెదిర్
పూరణ పొఱ్కుడమ్ వైత్తుప్ పుఱమెఙ్గుమ్
తోరణమ్ నాట్టక్ కనాక్కణ్డేన్ తోళ్షీ నాన్” (నాచ్చియార్ తిరుమొళ్షి)
వేల ఏనుగులు వెంటరాగా ఊరేగింపుగా
నారాయణుడు నడిచి వస్తున్నాడు; ఎదురెళ్లి
బంగారు పూర్ణకుంభం ఇచ్చినట్టూ, ఊరంతా
తోరణాలు కట్టినట్టూ కలగన్నాను సఖీ నేను
అని ఆ మాటలకు అర్థం.
పూర్వజన్మలో నువ్వు సత్యభామవు అని కోదైకు ఒక సందర్భంలో చెలికత్తెలు చెబుతారు. ఆ మాటలతో గత జన్మలో తాను కృష్ణుడితో కలిసి చేసిన పనుల్ని గుర్తు చేసుకుంటూంటుంది కోదై(శీకృష్ణ దేవరాయల ఆముక్తమాల్యద కావ్యం నుంచి).
ఆలయంలోని కృష్ణుడి కోసం కట్టిన పూమాలల్ని తండ్రి విష్ణుచిత్తుడికి తెలియకుండా అనుదినమూ తను వేసుకుని కృష్ణుడికి తగ్గట్టుగా ఉన్నానా అని అద్దంలో చూసుకుంటూ ఉండేది కోదై. తను వేసుకుని చూసుకున్న మాలల్ని ఆలయ దేవుడి కోసం పంపేది. ఇలా కోదై వేసుకున్న మాలలే ఆలయ దేవుడికి అలంకరించబడేవి. ఒకనాడు ఈ సంగతి తెలుసుకున్న విష్ణుచిత్తుడు కోదైను కోప్పడి కోదై వేసుకున్న పూమాలను పక్కన పెట్టేసి ఇంకో మాలను కట్టి దేవుడికి వేశాడు. ఆనాటి రాత్రి విష్ణుచిత్తుడి కలలోకి కృష్ణుడు వచ్చి కోదై ధరించిన మాలలే తనకు తగినవనీ, వాటినే తనకు వెయ్యమనీ చెప్పాడు. ఆ తరువాత నుంచీ కోదై వేసుకున్న పూమాలలే ఆలయ దేవుడు రంగపతి లేదా రంగమన్నార్కు చేరేవి. అందువల్ల కోదైకు ‘సూడిక్కొడుత్త సుడర్ కొడి’ అన్న పేరు వచ్చింది. సూడిక్కొడుత్త సుడర్ కొడి అంటే ‘వేసుకుని ఇచ్చిన జ్వాలా వల్లరి’ అని అర్థం. ఇలా వేసుకుని తీసిన మాలలను ఇచ్చినది కనుక కోదై ‘ఆముక్త మాల్యద’గానూ స్థిర పడింది.
పదిహేనళ్లది అయ్యాక కోదైకు వివాహం చెయ్యాలని సంకల్పిస్తాడు విష్ణుచిత్తుడు. ఇతరులతో పెళ్లికి ఒప్పుకోని కోదై తను శ్రీరంగంలోని రంగపతిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని మొండికేసింది. ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న విష్ణుచిత్తుడి కలలోకి వచ్చి భగవానుడు కోదైను వధువుగా అలంకరించి శ్రీరంగం ఆలయానికి తీసుకురమ్మని చెప్పాడు. విష్ణుచిత్తుడు ఆ ప్రకారంగా కోదైను శ్రీరంగం ఆలయానికి తీసుకెళతాడు.
రంగనాథుణ్ణి తన నాథుడుగా మనసా, వాచా కొలుచుకున్న కోదై కర్మణా “రంగనాథా” అంటూ రంగనాథుడి గర్భాలయంలోకి వెళ్లి ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయింది.
ఇలా రంగనాథుడిలో ఐక్యమైపోవడమే కోదై లేదా గోదా కళ్యాణం అయింది. కళ్యాణం అంటే పాణి గ్రహణం అన్న దానికి మించి ఆరాధించిన వారితో ఐక్యమౌపోవడం అన్న అత్యుదాత్తమైన తత్త్వాన్ని
గోదా కళ్యాణం మనకు తెలియజేస్తోంది.
– రోచిష్మాన్
9444012279
అంతర్జాతీయ కవి, విశ్లేషకుడు, కాలమిస్ట్, జెమలజిస్ట్