Woman asked Divorce : యుగ ప్రభావమో.. తమను ఎవరూ ఏం చేయలేరన్న అహమో ఏమో కానీ.. చిన్న విషయానికి కూడా విడాకుల వరకు వెళ్తున్నారు మహిళలు.. ఇలాంటి సంఘటనే మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇటీవల ఒక మహిళ తనకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. కారణం గురించి అడిగితే ఆమె చెప్పినది విన్న జడ్జిలు ముక్కున వేలేసుకున్నారు.
‘నాకు వివాహం జరిగి ఎనిమిది నెలల అవుతుంది. నా భర్త హనీమూన్ కోసం గోవా బదులు తన తల్లిదండ్రులతో తనను కూడా ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అయోధ్యకు తీసుకెళ్లాడు’. అని చెప్పింది. విడాకుల దరఖాస్తు ప్రస్తుతం కౌన్సెలింగ్ దశలో పరిశీలనలో ఉంది. దంపతుల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని కుటుంబ న్యాయస్థానం వివాహ సలహాదారు శైల్ అవస్తి గురువారం తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అవస్తి తెలిపిన వివరాలు పరిశీలిస్తే ‘2023, మే 3న ఈ జంట వివాహం చేసుకుంది. ఇద్దరూ మంచి వృత్తుల్లో ఉన్నారు. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా.. భార్య ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. బాగా సంపాదిస్తున్నందున భార్య హనీమూన్కు విదేశాలకు వెళ్లాలని పట్టుబట్టింది. భర్త మొదట్లో హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లడానికి వెనుకాడాడు.. తర్వాత తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అవసరాన్ని పేర్కొంటూ గోవా లేదంటే దక్షిణ భారతదేశంలో గమ్యస్థానాలకు వెళ్లడానికి అంగీకరించాడు.’
‘అయితే, తన భార్యకు సమాచారం ఇవ్వకుండా అయోధ్య, వారణాసికి విమాన టిక్కెట్లను బుక్ చేశాడు. బయల్దేరే ఒక రోజు ముందు భార్యకు చెప్పాడు. రామ మందిర విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు తన తల్లి అయోధ్యను సందర్శించాలని కోరుకుంటున్నట్లు అతను తన భార్యకు చెప్పాడు. ఆ సమయంలో మహిళ అభ్యంతరం చెప్పలేదు, కానీ కుటుంబం తిరిగి వచ్చిన తర్వాత దానిపై వాగ్వాదం జరిగింది. ఇది విడాకుల వరకు దారి తీసింది. విడాకుల దరఖాస్తును ఉటంకిస్తూ, ఆ వ్యక్తి తన తల్లిదండ్రులను చూసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడని ఆ మహిళ తన ప్రకటనలో పేర్కొంది. ఈ జంట ప్రస్తుతం కౌన్సెలింగ్లో ఉంది. ఈ విషయం పరిష్కరించడానికి కొంత సమయం పట్టవచ్చు’ అని అవస్తి తెలిపారు.