Narender Modi : బీజేపీ పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో బుధవారం రాత్రి అత్యవసర సమావేశం అయ్యారు. ప్రధాని మోడీ సీనియర్ నేతలతో ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ వ్యూహాలు, ప్రణాళికపై చర్చించినట్లు సమాచారం. దీంతోపాటు కేంద్ర మంత్రివర్గ విస్తరణ పై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. మంత్రివర్గంలో భారీ మార్పులకు చోటు ఉన్నట్లు సమాచారం.
ఇటీవల పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా పలువురు నేతలు కలిసి రాష్ట్రాల వారీగా సమావేశాలు నిర్వహించారు. లోకసభ తో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. దీంతోపాటు ఆయా రాష్ట్రాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుల మార్పు కూడా ఉండనున్నట్లు ప్రచారం బయటకు వచ్చింది.
అయితే ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని సమాచారం. ఎన్నికలకు ముందు వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను పక్కనపెట్టి కొత్తవారిని తీసుకునేందుకు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీ పై బీజేపీ నేతలు బయటకు వెల్లడించడం లేదు.
ఇటీవల జరిగిన కర్ణాటక ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురైంది. దీంతో కాంగ్రెస్ వైపు పలు రాష్ట్రాల్లో జనం చూపు మళ్లింది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ చత్తీస్ గుడ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నాలుగింట్లో కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే బీజేపీ ప్రస్తుతానికి అధికారంలో ఉంది. అయితే వచ్చే లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సంస్థాగతంగా పలుమార్పు లతో పాటు కేంద్ర మంత్రివర్గంలోకి ఆ రాష్ట్రాల నుంచి పలువురిని తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
ReplyForward
|