N.T. Rama Rao :
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత నందమూరి తారక రామారావు. ఆయనే ఒక చరిత్రను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచస్థాయిలో లిఖించుకున్నారు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు అంటే ఎవరికీ తెలియదు.. ఆయననే ఆ రెండు పాత్రల్లో నేటికీ ఊహించుకుంటున్నారు. ఎందుకంటే నట విశ్వరూపం ఆయన. పౌరాణిక, ఇతిహాస, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన చేయని పాత్ర లేదు. ఇక నటనలో ఆయనను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడిందంటే అందులో కీలక పాత్ర పోషించిన వారిలో ఎన్టీఆర్ ది ప్రముఖ స్థానం. 1949లో తొలి చిత్రం మన దేశం ద్వారా పోలీస్ పాత్రతో మొదలు పెట్టిన ఆయన ప్రయాణం ఇక వెనుదిరిగి చూడకుండా సాగింది. మొదటి చిత్రానికి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం వెయ్యి రూపాయలే. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఎదిగిన క్రమంలో ఆయన ఏకంగా 300 చిత్రాల్లో నటించి ఔరా అనిపించుకున్నారు. ఈ పాత్రలు కేవలం ఎన్టీఆర్ మాత్రమే చేయగలరు అనేలా నాడు పరిస్థితులు ఉండేవి. దటీజ్.. ఎన్టీఆర్
ఇక అన్న ఎన్టీఆర్ గా రాజకీయ రంగంలో అందరికీ దగ్గరయ్యాడు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ ప్రజల గొంతు నుంచి పుట్టిన పార్టీ తెలుగు దేశం పార్టీ. నాటి ఉత్తరాది పాలకుల అధిపత్యాన్ని ఎదురించి నిలిచిన ఎన్టీఆర్ మొదటి అడుగులోనే తనెంటో నిరూపించాడు. తెలుగు జాతి పౌరుషాన్ని ఏకతాటి పైకి తెచ్చి తన లక్ష్యాన్ని సాధించాడు. తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ తారక రాముడి అడుగుకి ఢిల్లీ కోటలే కదిలాయంటే అతిశయోక్తి కాదు. ఆయన చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరిగి, 9 నెలల కాలంలోనే టీడీపీని అధికారంలోకి తెచ్చారు. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను బోల్తా కొట్టించి, అధికార పీఠాన్ని దక్కించుకున్నాడు. ఢిల్లీకి తెలుగోడి సత్తాను రుచిచూపించాడు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపు ఒక తూటాలా జనంలోకి వెళ్లింది. ఇక ప్రతి తెలుగు వాడి ఇంట్లో ఆరాధ్య దైవంగా నాడు ఎదిగిన ఎన్టీఆర్.. రాజకీయ నాయకుడిగాను అదే అభిమానాన్ని పొందాడు. వారసత్వంలో మహిళలకు హక్కులపై మొదటగా గట్టిగా పట్టుబట్టిన లీడర్ ఎవరైనా ఉన్నారంటూ ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆరే.
ఆయన హయాంలోనే రేషన్, మద్య పాన నిషేధం, తదితర పలు ప్రజా సంక్షేమ పథకాలు తొలిసారిగా అమలయ్యాయి. సినిమాల నుంచి రాష్ర్ట ముఖ్యమంత్రి గా ఎదగడం వరకు ఆయనో చరిత్ర. ఇక కుటుంబం విషయానికొస్తే అన్న ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు11 మంది సంతానం. ఇందులో ఏడుగురు కొడుకులు, నలుగురు బిడ్డలు ఉన్నారు. 33 ఏళ్లు సినిమా రంగంలో, 13 ఏండ్లు రాజకీయ రంగంలో తనకు సాటి మరొకరు లేరు అన్నట్లుగా ఎన్టీఆర్ ఎదిగారు. ఇక 1993లో తనకంటే 30 ఏండ్లు చిన్నదైన లక్ష్మీపార్వతితో వివాహం తర్వాత కుటుంబంలో పెడచూపిన విభేదాలే టీడీపీలో చీలికలకు కారణమయ్యాయి. లక్ష్మీపార్వతి అధిపత్యాన్ని ఇష్టపడని కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ను కాదని పార్టీని చీల్చారు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో చంద్రబాబు టీడీపీ అధినేతగా ఎదిగారు. అనంతరం గుండెపోటుతో 1996 లో ఎన్టీఆర్ కన్నుమూశారు.