Pawan Kalyan : ఏపీలో ఎన్నికల కోలాహాలం మొదలైంది. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో పార్టీలన్నీ బిజీబిజీగా మారిపోయాయి. ఈ రోజు టీడీపీ, జనసేన ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు రెడీ అయ్యాయి. లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. లక్షలాదిగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు జనసేనాని పవన్ కూడా హాజరవుతారని నిర్ణయించారు. కానీ సభకు పవన్ దూరంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.
ఈ రోజు సాయంత్రం విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద ‘నవశకం సభ’కు టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సభను భారీ ఎత్తున నిర్వహిస్తుండడంతో చంద్రబాబు, పవన్ పాల్గొనాలని నిర్ణయించారు. అయితే మొదట ఈ సభకు హాజరుకాలేనని పవన్ సమాచారం ఇచ్చారు. చంద్రబాబు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం పవన్ తానూ సభకు హాజరవుతానని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం పవన్ విజయనగరం చేరుకోవాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు చేరుకున్నారు. ఈ సభ ద్వారా ఇద్దరు నేతలు కీలక ప్రకటన చేస్తారని ఇరు పార్టీల క్యాడర్ భావించారు.
ఈ సభలో టీడీపీ, జనసేన పొత్తు అవసరం, సీట్ల పంపకం, రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం వంటి వివిధ అంశాలను సభలో ప్రస్తావించి కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. పొత్తుతోనే వైసీపీని ఎదుర్కొని అధికారంలోకి రావచ్చని భరోసా కల్పించనున్నారు. అలాగే సీట్లు రాని నేతలు నిరుత్సాహపడవద్దని, పార్టీ అధికారంలోకి రావాలంటే కొంత త్యాగం చేయాల్సి ఉంటుందని నచ్చజెప్పనున్నారు. సీట్లు రాని వారి భవిష్యత్ కు భరోసా కల్పిస్తామని ప్రకటించనున్నారు. అలాగే వైసీపీకి, జగన్ పై సమర శంఖం పూరించనున్నారు.
తాజాగా పవన్ హాజరుపై సందిగ్దత నెలకొంది. పవన్ జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం విమానంలో విశాఖకు వెళ్లి.. అక్కడి నుంచి విజయనగరం సభకు చేరుకోవాల్సి ఉంది. కానీ, ఆరోగ్య కారణాలతో పవన్ హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
అయితే పవన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో పవన్ హాజరవుతారా? కారా? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. టీడీపీ నేతలు మాత్రం పవన్ తప్పక హాజరవుతారని చెబుతున్నారు.