Radisson Drugs Case : హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా, మరికొందరు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా పోలీసులు కొంతమంది వివరాలు సేకరించినట్లు తెలిసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు గజ్జల వివేకానంద్ కు డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీని గచ్చిబౌలి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బుధవారం వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. అబ్బాస్ వివిధ మార్గాల్లో కొకైన్ తెచ్చి డ్రైవర్ ప్రవీణ్ కు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత ప్రవీణ్.. వివేకానంద్ కు అందిస్తున్నాడు. ప్రవీణ్, అబ్బాస్ ల మధ్య నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ పార్టీకి సినీ డైరెక్టర్ క్రిష్ హాజరైనట్లు దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. శుక్రవారం వస్తానని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో తెలిసి విషయాల ప్రకారం.. వివేకానంద్ వీకెండ్స్ లో హోటల్ కు వచ్చేవాడని, తన స్నేహితులతో పార్టీలు నిర్వహించేవాడని వెల్లడైంది.
కాగా, రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు పొందుపరిచారు. ఈ కేసులో ఏ-10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఆయనకు సీఆర్ పీసీ 160 నోటీసులు జారీ చేశామని కోర్టుకు రిపోర్ట్ చేశారు. పార్టీలో మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద్ సూచన మేరకే అతడి డ్రైవర్ ప్రవీణ్ కు డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ కొకైన్ డెలివరీ చేశాడని పోలీసులు తేల్చారు.
ఈ నెల 24న వివేక్ తన ఫ్రెండ్స్ డైరెక్టర్ క్రిష్, రఘుచరణ్, కేదార్ నాథ్, సందీప్, శ్వేత, లిషి, నిల్ డ్రగ్స్ తీసుకున్నారని చెప్పారు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ ఫ్రెండ్స్ ను ఆహ్వానించిన వాట్సాప్ చాటింగ్ ను గుర్తించామని పోలీసులు తెలిపారు.