AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు జగన్ మద్య నిషేధం తీసుకొస్తామని ప్రకటించారు. ఎన్నికలయ్యాక ఆ హామీని నిలబెట్టుకోలేదు సరికదా ఇంకా మద్యం దుకాణాల సంఖ్యను పెంచేశారు. దీంతో మద్యంప్రియులకు మందు విరివిగా దొరుకుతోంది. బెల్టుషాపుల సంఖ్య నానాటికీ పెంచేశారు. రాష్ట్రంలోని పల్లె పల్లెలో మద్యం ఏరులై పారుతోంది.
ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో మద్యం దుకాణాలపై అజమాయిషీ చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మేందుకు సమ్మతించడంలేదు. ఎన్నికల వేళ మద్యం ఏరులై పారితే గొడవలు వచ్చే ఆస్కారం ఉంటుందని అనుకున్నారో ఏమో గానీ అబ్కారీ శాఖ అధికారులు మద్యం పంపిణీలో అక్రమాలకు ఆస్కారం ఇవ్వడం లేదు. గతేడాది ఎంత స్థాయిలో మద్యం సరఫరా అయిందో ఇప్పుడు కూడా అంతే ఉండాలని చెబుతోంది.
ఏ రోజుకారోజు స్టాకు పరిశీలిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మే షాపులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఇది వైసీపీకి రెండు విధాలా మేలు చేస్తుందంటున్నారు. అధికారంలో ఉన్నా మద్యం ఏరులై పారకుండా చర్యలు తీసుకుంటున్నారనే కోణంలో ఆలోచిస్తారు. ఎన్నికల వేళ మద్యం వ్యాపారులను కట్టడిచేశారు సీఎం అని మరో కోణంలో మేలు జరుగుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే మద్యం బ్లాక్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్ ను అడ్డుకోకుండా షాపులపై ఆంక్షలు విధిస్తే ఏం లాభమని మందుబాబులు అంటున్నారు.
ఈనేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పరిణామాలు ఎవరికీ మేలు చేస్తాయో తెలియడం లేదు. మద్యం దుకాణాలు మాత్రం నిబంధనలకు లోబడి ఉండాల్సిందంటున్నారు. రాత్రుళ్లు తెరిచి ఉంచే వాటిని మూయించేందుకు కూడా వెనకాడడం లేదు. దీంతో ఏపీలో ఏం జరుగుతుందోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. గత ఎన్నికలప్పుడు మద్య నిషేధం తెస్తానని చెప్పినా జగన్.. ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన తేవడం లేదని మహిళలు అంటున్నారు. మద్యం షాపులను నియంత్రించడంతో పాటు బ్లాక్ మార్కెట్ ను పూర్తిగా రూపుమాపాలని కోరుతున్నారు.