Scooty Scheme : ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమలుచేసింది. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రెండోది ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం. ఇవి రెండూ విజయవంతంగా అమలు అవుతున్నాయి. ఇక మిగతా గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే రేవంత్ సర్కార్ హామీ ఇచ్చిన మిగతా వాటిలో 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు అందించడం. గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు తీసుకుంటుండడంతో తమకు స్కూటీలు ఎప్పుడు పంపిణీ చేస్తారని అమ్మాయిలు అడుగుతున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 1784 కాలేజీలు ఉండగా.. పేద విద్యార్థినులు 3 లక్షల మంది దాక ఉన్నారు. వీళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70వేల మంది దాక ఉన్నారు. అయితే కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీకి 50వేల చొప్పున అనుకున్నా 70వేల మందికి 350 కోట్లు కావాలి. ఇంకా ఇతర తెలంగాణ జిల్లాల్లో కొన్ని వేలమంది ఉంటారు. 18 ఏండ్లు నిండినా ప్రతీ కాలేజీ అమ్మాయికి స్కూటీ ఇవ్వాలంటే వందల కోట్లు అవసరం పడుతాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు అమలు చేయనుంది. ఏవైనా పరిమితులు పెడుతుందా? కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికే ఇస్తుందా? అనేది చూడాలి.
ఇప్పటికే అన్నీ పథకాలకు దరఖాస్తులు తీసుకుంటుండడంతో స్కూటీ పథకంపై కూడా అమ్మాయిలు ఆశలు పెంచుకున్నారు. అయితే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని శ్వేతపత్రం రిలీజ్ చేసినా రేవంత్ సర్కార్ కు గ్యారెంటీ పథకాలు కచ్చితంగా భారం కావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాలి.. లేకుంటే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో ఉండరు.. ఇలా రేవంత్ సర్కార్ కు ముందు నుయ్యి.. వెనక గొయ్యి అనే పరిస్థితే ఉండబోతుంది.
గ్యారెంటీలకు దరఖాస్తులు తీసుకుంటున్నా.. వాటిలో జనాలకు అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతీ లబ్ధిదారుడికి గ్యారెంటీ పథకాలు అమలు చేస్తారా? లేదా ? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గత పది రోజులుగా ఈ గ్యారెంటీ పథకాల కోసం జనం మాత్రం తీవ్రంగా గాబరా పడుతున్నట్లు తెలుస్తోంది. తమకు పథకం వర్తిస్తుందా.. లేదా.. అనే అనుమానాలు వారిని తొలుస్తున్నాయి.