Nizamabad Crime : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నమ్మిన స్నేహితుడే నరహంతకుడిగా మారాడు. వారం వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.
నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలి మాచారెడ్డికి వెళ్లిపోయింది. అక్కడే నివాసం ఏర్పర్చుకుంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్కు మాక్లూర్లో ఓ ఇల్లు ఉంది. అతని స్నేహితుడైన ప్రశాంత్ కు ఆ ఇంటిపై కన్నుపడింది. ఈ క్రమంలో స్వాధీనం చేసుకునేందుకు పథకం రచించాడు. ఇంటిల్లిపాదిని హత మారిస్తే తప్ప ఆ ఇల్లు తన సొంతం కాదనుకున్నాడు. అనుకున్న ప్రకారం పథకం రచించి అమలు చేశాడు
ప్రసాద్ ఇంటిని ఎలాగైనా దక్కించుకోవాలన్న కాంక్షతో దారుణానికి ఒడిగట్టాడు. లోన్ ఇప్పిస్తానని ప్రసాద్ కు మాయమాటలు చెప్పి ఇంటిని అతని పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తీరా లోన్ రాకపోయే సరికి ఇల్లును తిరిగి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్ను ప్రసాద్ ఒత్తిడి చేశాడు.
తాను రచించిన పథకం ప్రకారం ప్రశాంత్.. ప్రసాద్ను బయటకు తీసుకెళ్లాడు. నిజామాబాద్ – కామారెడ్డి జాతీయ రహదారికి సమీపంలోని అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్లిన ప్రశాంత్ నీ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని, ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో పడేశాడు. ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో చంపినట్లు సమాచారం.
చిన్న వయసులోనే ఇంత దారుణం..
మాక్లుర్కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడు. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురిని కలుపుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు హత్యకు గురవడంతో ఎక్కడ కూడా అదృశ్యం కేసులు నమోదు కాలేదు. నమ్మిన స్నేహితుడే నర హంతకుడిగా మారి కుటుంబాన్ని మట్టుబెట్టడం కలకలం రేపుతుంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.