Y. S. Sharmila : వైఎస్సార్టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. దీనికి అనుకూలంగానే షర్మిలతో పాటు కాంగ్రెస్ నాయకుల అడుగులు పడ్డాయి. అయితే ఆమె సేవలను ఏపీకి పరిమితం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరారు. అధిష్టానం కూడా షర్మిల సేవలను ఏపీలో వాడుకోవడం ద్వారా, తిరిగి కాంగ్రెస్ జవసత్వాలు తేవాలని భావించింది. అయితే ఏపీలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నందున అక్కడి రాజకీయాల్లో తాను వేలు పెట్టలేనని షర్మిల చెబుతున్నట్లు సమాచారం.
అయితే పోయిన చోటే వెతుక్కోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. కాంగ్రెస్ శ్రేణులను తన వైపు లాగేసుకున్న జగన్ ను దెబ్బకొట్టాలంటే షర్మిలను వాడుకోవాలని చూస్తున్నది. అయితే షర్మిల మాత్రం ఇందుకు సమ్మతించడం లేదు. ఏపీ పీసీసీ చీఫ్ ఇస్తామని హామీనిచ్చినా అందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇక విలీనం అంశం తేలకపోవడంతో, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి షర్మిల యాక్టివ్ అయ్యారు. ఇటీవల ఎల్బీనగర్, గజ్వేల్ పర్యటనలంటూ హడావుడి చేశారు.
అయితే షర్మిల పర్యటనను అనవసరంగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నదనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఆమెకు లేని అవకాశాలను బీఆర్ఎస్సే కలిపిస్తున్నదనే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. అయితే ఇది వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందమని కాంగ్రెస్ లో ఓవర్గం వాదన. ఏపీలో అన్నకు సీఎం కేసీఆర్ సహకరిస్తున్నందున ఇక్కడ బీఆర్ఎస్ కు అండగా నిలిచేందుకు షర్మిల ఈ రాజకీయాలు చేస్తున్నదని అనుమానిస్తున్నారు. ఏదేమైనా షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఇక లేనట్లే అని అర్థమైంది. ఇన్నాళ్లు డీకే శివకుమార్ ద్వారా మంతనాలు జరిపినా, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక షర్మిల తన దారి తాను చూసుకున్నట్లు కనిపిస్తున్నది. మరి ఇప్పుడు తెలంగాణలో బరిలోకి దిగి, అభ్యర్థులను నిలబెడితే ఓట్ల చీలిక ఏ పార్టీకి మేలు చేస్తుందో తెలియనది కాదు. ముఖ్యంగా కాంగ్రెస్ పైనే దీని ప్రభావం ఉంటుందనే టాక్ వినిపిస్తున్నది. మరి ఇది బీఆర్ఎస్ కు లాభం చేకూరుస్తుంది. మరి రానున్న రోజుల్లో షర్మిల తో కాంగ్రెస్ ఏమైనా చర్చలు జరుపుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.