Rayala seema Declaration : టీడీపీ యువనేత లోకేశ్ ప్రస్తుతం యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆయన పాదయత్ర కొనసాగుతున్నది. ఇప్పటికే 100 రోజుల యాత్ర పూర్తయింది. ఆయన యాత్ర ప్రస్తుతం రాయలసీమలో కొనసాగుతున్నది. అయితే ఈ పాదయాత్ర రాయలసీమలో పూర్తయ్యేలోపు ఈ ప్రాంత అర్థికాభివృద్ధి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలను ప్రకటిస్తానని లోకేశ్ చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర సీఎం జిల్లా కడపలో కొనసాగుతున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆయన పర్యటన ముగిసింది.
తన పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను లోకేశ్ ఎప్పటికప్పుడూ నోట్ చేస్తున్నారు. సీమలో వలసలు అరికట్టి ఉపాధి అవకాశాలు కల్పించడం, యువత, రైతులకు అండగా నిలవడం, ఆడబిడ్డల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఎక్కడికక్కడ సమస్యలపై ఓ రిపోర్టు తన టీంతో తయారు చేయిస్తున్నారు. దీనిపై ఒక ప్రత్యేక బృందం ఓ నివేదికను సిద్ధం చేస్తున్నది. ముఖ్యంగా యువతే లక్ష్యంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వెనుకబడిన రాయలసీమ జిల్లా అభివృద్ధి ఒక్క టీడీపీ కే సాధ్యమని, వైసీపీ కేవలం ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితమని ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా వివేకా హత్య కేసును పదేపదే గుర్తు చేస్తున్నారు. జగన్ స్వభావం, గతంలో చేసిన అవినీతిని ఆయన ప్రసంగంలో చెబుతున్నారు.
అయితే ఎన్నో ఏండ్లుగా తమ గుత్తాధిపత్యం కింద రాయలసీమను ఏలుతున్న వైఎస్ ఫ్యామిలీ దీని అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. రాయలసీమకు వచ్చే పరిశ్రమలను కూడా వారు అడ్డుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే గతంలో అధికారంలో ఉన్న కియా పరిశ్రమను టీడీపీ తెస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పెట్టిందనే చర్చ జోరుగా జరిగింది. అయితే సీమలో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని లోకేశ్ చెబుతున్నారు. త్వరలోనే రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించడం ద్వారా పార్టీకి మైలేజ్ తేవాలని ఆయన భావిస్తున్నారు. లోకేశ్ పర్యటనకు కడపలో మంచి ఆదరణ వస్తున్నది. ఇదే సందర్భంగా ఆయన రాయలసీమ ప్రజలను ఆకట్టుకునేలా ఒక ప్రకటన చేయాలని భావిస్తున్నారు.