KCR Sarkar Debts : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. కేసీఆర్ హయాంలో రూ.6లక్షల కోట్ల అప్పులు చేశారని, వాటికి ఇప్పుడు అసలు, వడ్డీలు కూడా కట్టుకోలేని స్థితికి తీసుకొచ్చారని ఆ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన టైంలో తెలంగాణ వాటాగా అప్పుల రూ.72,658 కోట్లు వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు మొత్తం రూ.6,71,757 కోట్లుగా లెక్క తేల్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణభారం పెరిగిందని శ్వేతపత్రంలో వెల్లడించారు. 57ఏండ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98లక్షల కోట్ల వ్యయం చేశారని.. అంత కంటే ఎక్కువ అప్పు కేసీఆర్ ప్రభుత్వం చేసిందని ప్రభుత్వం అందులో పేర్కొంది.
2014లో మిగులు రాష్ట్రంగా ఉనన తెలంగాణ 2023లో అప్పుల్లో ఉందన్నారు. బడ్జెటేతర రుణాలు పేరుకపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్ కింద అప్పులు తెచ్చుకుని ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తోందని నివేదిక తెలిపింది. ఈ నివేదికలోని అంశాలపై ఆర్థిక మంత్రి భట్టి మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రావడం నేను దురదృష్టంగా భావిస్తున్నా. దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను మేము బాధ్యతాయుతంగా అధిగమిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.
అయితే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయంటూ ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే శ్వేతపత్రం అంటూ నాటకాలు ఆడుతోందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు శ్వేతపత్రం విడుదలపై స్పందిస్తూ..ఇలా రాష్ట్రం దివాళా తీసిందని ప్రచారం చేస్తే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే తప్పుల తడకగా శ్వేతపత్రం తీసుకొచ్చారని, ఇలా చేయడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ నిర్వాహకం వల్ల తెలంగాణ దివాళా స్థితిలో ఉందని తెలిస్తే అంతర్జాతీయంగా ఇమేజ్ పోతుందని, అప్పుడు పెట్టుబడిదారులు ఎవరూ తెలంగాణకు రారన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కాంగ్రెస్ నేతలు ఎన్నడూ మాట్లాడలేదనన్నారు. ఏపీ అధికారులతో శ్వేతపత్రం తయారు చేయించారని హరీశ్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుకుతోందన్నారు.
శ్వేతపత్రం విడుదల అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అసెంబ్లీలో వాగ్యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉండగా.. జనాల్లో శ్వేతపత్రంపై విపరీతంగా చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ 6లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఇక కాంగ్రెస్ ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తుందో కదా అని చర్చించుకుంటున్నారు. రోజువారీ ఖర్చులకే డబ్బులు లేకుంటే ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.