Triangle case : ప్రేమ, ప్రేయసి కోసం ప్రేమికుడు మరో వ్యక్తిని మర్డర్ చేయడం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి రావడంతో సమాజం ఉలిక్కిపడుతోంది. ఆరు నెలల క్రితం నవీన్ హత్య కేసును మరువకముందే ఇప్పుడు మరో జూనియర్ ఆర్టిస్ట్ హత్యకు గురయ్యాడు. ఇది మరింత కలకలం రేపుతోంది.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుండడంతో సినిమా జూనియర్ ఆర్టిస్ట్ ను ఒక యూట్యూబర్ తన ఫ్రెండ్స్ తో కలిసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల (ఆగస్ట్) 13వ తేదీన సినిమా జూనియర్ ఆర్టిస్ట్ కే కార్తీక్ (18) కనిపించకుండా పోయాడు. తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికిన అతని సోదరుడు అదే నెల (ఆగస్ట్)16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా వారికి ఎటు వెళ్లాలో దారి కనిపించలేదు. ఈ నేపథ్యంలో కార్తీక్ సెల్ ఫోన్ ను నిందితుల్లో ఒకరు (సురేశ్) స్వీచ్ ఆన్ చేయడంతో కీలక అడుగు పడింది. సురేశ్ ను విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి. హత్య ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు అస్తిపంజరాన్ని వెలికి తీశారు. పరిశీలనకు ఫోరెన్సిక్ విభాగానికి పంపిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయెల్ డేవిస్ వివరాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాకు చెందిన యూ ట్యూబర్ సాయి జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు. కొన్ని రోజులు వీరి రిలేషన్ కొనసాగింది. విభేదాలు రావడంతో కొన్ని రోజుల క్రితం విడిపోయారు. ఆ అమ్మాయికి తెలంగాణలోని మహబూబాబాద్ కు చెందిన కార్తిక్ దగ్గరయ్యాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారు కలిసి ఉండడం చూసి సాయి కసాయిగా మారాడు.
గత నెల (ఆగస్ట్) 13వ తేదీ సాయి కార్తీక్ కు ఫోన్ చేసి అమ్మాయికి సంబంధించిన కొన్ని వస్తువులు నా వద్ద ఉన్నాయని వాటిని తీసుకెళ్లేందుకు రావాలని సూచించాడు. దీంతో కార్తిక్ వెళ్లాడు. బోయిన్పల్లిలోని నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు సాయి. అప్పటికే అతనితో అతని స్నేహితులు ఎం రఘు, జగదీష్, సురేశ్ ఉన్నారు.
కార్తీక్ ను కొట్టి చెట్టుకు కట్టేశారు. కత్తులతో పొడిచి తలపై బండలతో కొట్టి చంపారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందులో సురేశ్ కార్తీక్ సెల్ ఫోన్ ను తన వద్ద ఉంచుకున్నాడు. సాయి, రఘు, జగదీష్ స్వగ్రామాలకు వెళ్లగా సురేశ్ మాత్రం సిటీలోనే ఉన్నాడు. కార్తీక్ మొబైల్ ఆన్ చేయగా అసలు విషయం బయటపడింది.