తెలుగు రాష్ట్రాలను ఎండలు భయపెడుతున్నాయి. వారం క్రితం వరకు అకాలవర్షాలతో ఇబ్బంది పడ్డ ప్రజానీకానికి ఇప్పుడు పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ముచ్చెముటలు పోయిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణంలో మార్పులతో పాటు రానున్న నాలుగు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నది. మోచా తుఫాన్ తన దిశ మార్చుకోవడంతో ఊపిరి పీల్చుకున్న జనానికి ఈ ఎండలు ఊపిరి సలపనీయడం లేదు.
వేడిగాలులతో సతమతం..
రానున్న నాలుగు రోజుల్లో ఎండల ప్రభావం మరింత తీవ్రం కానుంది. రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ మీదుగా వీస్తున్న ఈదురుగాలుల ప్రభావం ఏపీపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎండలు ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉండనుంది. 46 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదయ్యే అవకాశమున్నదని అధికారులు చెబుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, పల్నాడు జిల్లా రావిపాడు, గోదావరి, పొట్టిశ్రీరాములు, వైఎస్సార్ కడప జిల్లాల్లో బుధవారం 43 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో రానున్న రెండు రోజుల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశమున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. దీని తీవ్రత మెజార్టీ మండలాల్లో ఉంటుందని తెలియజేసింది. ఏపీ వ్యాప్తంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నది. ఎండల నుంచి రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నది. అవసరముంటేనే ఇంటి నుంచి బయటకెళ్లాలని చెబుతున్నది. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, ఉపశమనానికి వీలైన పండ్లు ఎక్కువగా తినాలని సూచిస్తున్నది.