- మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర
Karnataka results 2023 Out Today : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. మొత్తం 224 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 113 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. అయితే ఫలితాలపై ఇప్పటికే పార్టీల లెక్కలు పూర్తయ్యాయి. ఇక ప్రజల లెక్కలు కౌంటింగ్ ద్వారా తేలనున్నాయి. కాంగ్రెస్ కే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 11 గంటలకల్లా ట్రెండింగ్ తెలిసిపోనుంది. 36 కౌంటింగ్ సెంటర్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే శనివారం ఉదయం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు రాష్ర్టంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ఇదివరకే ప్రకటించారు.
కాంగ్రెస్.. బీజేపీల మధ్యే పోటీ..
2018 ఎన్ని్కల్లో బీజేపీ 108, కాంగ్రెస్ 80, జేడీఎస్ 30 గెల్చుకున్నాయి. మరి ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరు నిలుస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఎవరో ఒక అభ్యర్థి సీఎం పీఠం అధిరోహించడం ఖాయం. కింగ్ మేకర్ గా నిలిచేందుకు జేడీఎస్ కు ఆ స్థాయిలో సీట్లు వస్తాయా అనేది అనుమానమే. అయితే ప్రజల నిర్ణయం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈవీఎంలు తెరవాల్సిందే. అందుకు మరికొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు మధ్యాహ్నానికల్లా ఓ అంచనానికి వచ్చేలా చేయనున్నాయి. ఏదేమైనా కర్ణాటక ప్రజల గుండెల్లో ఎవరున్నారో ఇక తేలే సమయం అసన్నమైంది. ఈ ఎన్నిక ఫలితం చాలా పార్టీల్లో కొంత వణుకు పుట్టిస్తున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో కూడా దీనిపై చర్చ సాగుతున్నది. మరోవైపు జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ప్రచారంలో ఉంది.