CBN self goal : టీడీపీ మహానాడు లో ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. చంద్రబాబు తన పాలనలో అభివృద్ధి మంత్రం జపించారు. దీంతో 2019 ఎన్నికలు చంద్రబాబును అధికారం నుంచి దూరం చేశాయి. అదే సమయంలో నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలతో ఆకట్టుకున్న జగన్ ఏపీ సీఎం అయ్యారు. మహనాడు లో ప్రకటించిన మినీ మేనిఫెస్టో లో జగన్ ను మంచి పోయాడనే చర్చ జోరుగా సాగుతున్నది.
ట్రాక్ మారిందా?..
ఉచిత పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంకలా తయారు చేస్తున్నారని మొన్నటి వరకు టీడీపీ నాయకులు, అనుకూల మీడియా విమర్శలతో దాడికి దిగింది. ఇప్పడు అంతకు మించిన హామీలతో టీడీపీ తొలి మేనిఫెస్టో ప్రకటించింది. మరి ఆ విమర్శలకు టీడీపీ చెప్పే సమాధానం ఎలా ఉండబోతుందో కొద్ది రోజుల్లో తేలనుంది. సంపద సృష్టిస్తామనే విషయాలు చెప్పకుండా రెవెన్యూ ఎలా పెంచుతారనే స్పష్టతనివ్వకుంటే మాత్రం మరోసారి టీడీపీ పుట్టి మునగక తప్పదు.
ఆదాయ మార్గాలు ఏవి?..
ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాద్ లాంటి ఆదాయం తీసుకొచ్చే నగరం విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా లేదు. మిగతా ఆదాయాలపైనే ఆధారపడక తప్పని పరిస్థితి. పన్నులు వసూలు చేయాలి. ప్రజలపై భారం మోపక తప్పదు. పన్నుల పెంపునూ టీడీపీ వ్యతిరేకిస్తున్నది. మరి పథకాల అమలుకు నిధులు ఎలా తీసుకొస్తారో టీడీపీ నేతలు ఏం చెబుతారో చూడాల్సిందే. టీడీపీ ప్రకటించిన పథకాల అమలుకు ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ ఎలా చేస్తుందో, ప్రజలను ఒప్పిస్తుందో చూడాల్సిందే.
కర్ణాటక ప్రభావం..
తెలుగుదేశం మేనిఫెస్టోపై కర్ణాటక ఎన్నికల ప్రభావం పడిందని స్పష్టంగా తెలుస్తున్నది. ఇలాంటి హామీలతోనే కర్ణాటక ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు అదే ఫార్ములాను టీడీపీ అమలు చేస్తున్నట్లుగా స్పష్టమవుతున్నది.
బీజేపీని వీడి..
2018 వరకు కేంద్రంలోని బీజేపీ టీమ్ లో ఉన్న చంద్రబాబుపై ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు డైవర్ట్ అయ్యారు. బీజేపీతో ఉంటే తనకు నష్టం తప్పదని భావించిఎన్డీఏ నుంచి వైదొలిగారు. బీజేపీతో పొత్తుకు, ఎన్డీయేలో భాగస్వామ్యానికి, కేంద్రమంత్రి పదవులకు గుడ్ బై చెప్పేసిన టీడీపీ ఎటుకాకుండా పోయింది.ఈ నిర్ణయం ఏదో కొంత ముందుగా తీసుకున్న ప్రజల నుంచి వ్యతిరేకత రాకపోయి ఉండేది. దీంతో జగన్ రాజకీయ చతురతకు సీబీఎన్ బొక్కబోర్లా పడ్డారు. అధికారానికి దూరంగా ఉన్నారు. జగన్ కేంద్రంలోని ఎన్డీఏ లో చేరకున్నా ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తూనే వస్తున్నారు. ఇప్పటి దాకా సంక్షేమ పథకాలపై అంతగా పట్టించుకోని చంద్రబాబు జగన్ ను నిలువరించాలనే ఆలోచనలో ట్రాప్ లో పడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కనిపించని బాబు మార్క్..
రాజమండ్రిలో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను పరిశీలిస్తే వైసీపీ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే నమ్మకం ప్రజల్లో కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు గొప్పగా చేసిందేమీ లేదు. కానీ ప్రస్తుత మేనిఫెస్టోను పరిశీలిస్తే కర్ణాటక ఎన్నికల ప్రభావం, నవరత్నాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నది. చివరకు జగన్ ను దింపడమే టార్గెట్గా పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రకటించినట్లు తెలుస్తున్నది. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో జగన్ కు రక్షణ కవచంలా మార్చేలా కనిపిస్తున్నది.