Changes in BJP : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాషాయ పార్టీ తెలంగాణలో తన ప్రభావాన్ని కోల్పోతున్నది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు అయ్యాక ఒక్కసారిగా ఆ పార్టీకి తెలంగాణ లో హైప్ వచ్చింది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఆ పార్టీలో అసమ్మతి మెల్ల మెల్లగా బయట పడుతున్నది. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అధిష్టానం కూడా చేయాల్సిన మార్పులపై దృష్టి సారించింది. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యం పెట్టుకుంది. దీంతో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ప్రచార సారథి బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
రాష్ర్టంలో పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతున్నది బీజేపీ గుర్తించించింది. మొన్నటి వరకు ఉన్న ఉత్సాహం ఇప్పడు కనిపించడం లేదు. పార్టీలోకి వలస వచ్చిన నేతలు.. పాత నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం తారాస్థాయికి చేరింది. బీజేపీలో కోవర్టులు ఉన్నారని, కాషాయ పార్టీని బలహీనపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని, త్వరలోనే వారి పేర్లను వెల్లడిస్తామంటూ కొందరు చేస్తున్న ప్రకటనలతో పరిస్థితి మరింత దిగజారుతోంది.
దీంతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయనుందనే ప్రచారం జరుగుతున్నది. అయితే నాయకులంతా కలసికట్టుగా పని చేసేలా చూడటం.. ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎన్నికలకు సిద్ధం కావడం, పార్టీ కార్యక్రమాల జోష్ పెంచడం ప్రధానోద్దేశంగా తెలుస్తున్నది. ఈటల రాజేందర్ ఇప్పటికే చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించడంతో పాటు.. మరికొన్ని మార్పులు చేసేందుకు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈటలకు బాధ్యతలు అప్పగిస్తే ఈ గ్యాప్ ను ఆయన ఏ మేరకు పూడుస్తారో చూడాల్సిందే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈటల అత్యవసరంగా సమావేశం కాగా, పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. పార్టీ ప్రచారం, హామీలు, మేనిఫెస్టో, క్రమశిక్షణ తదితర కమిటీల ఏర్పాటు తో పాటు చేరికలు ఉంటాయని చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ప్రచార కమిటీ వంటి కీలక బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెలలో బీజేపీ అగ్ర నేతలు రాష్ట్ర పర్యటనకు వస్తున్న తరుణంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలువురు కీలక నేతలకు పదవులు ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచి బలోపేతం కావాలనే ఆలోచనలో కమలదళం ఉన్నట్లు తెలుస్తున్ని. త్వరలోనే వీటికి సంబంధించి కీలక ప్రకటనలు వచ్చే అవకాశముందని సమాచారం. మరి రానున్న కొద్దిరోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.