Tirupati Laddu :
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఇక నుంచి నందిని నెయ్యిని వినియోగించరు. దీంతో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించే మరో కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చాలా ఫేమస్. తిరుమల వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఈ లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని తమ బంధువులు, స్నేహితులకు పంచుతుంటారు.
తిరుమల లడ్డూ తయారీకి గత 50 ఏళ్లుగా కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్ నందిని నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇకపై శ్రీవారి లడ్డూ తయారీలో ఈ నెయ్యి వాడకం నిలిచిపోనున్నది. లడ్డూ తయారీకి పంపే నాణ్యమైన నందిని నెయ్యిని ఇకపై సరఫరా చేయలేమని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు.
నెయ్యి టెండర్ వేరే కంపెనీకి
తిరుమల లడ్డూలకు ఇకపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నిర్వహిస్తున్న నందిని డెయిరీ నెయ్యి సరఫరా చేయడంలేదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ తెలిపారు. నందిని పాల ఉత్పత్తుల ధరల పెంపు కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి టెండర్ను మరో కంపెనీకి అప్పగించింది.
ఆగస్టు 1 నుంచి పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడంతో నెయ్యి ధరలు కూడా పెరగనున్నాయి. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించేందుకు కొత్త కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసింది.
అందుకే చాలా ఏళ్ల తర్వాత టీటీడీకి నందిని నెయ్యి సరఫరా నిలిపివేశారు. నందిని నెయ్యి ప్రపంచ ప్రమాణాలతో తయారు చేస్తున్నామని భీమా నాయక్ తెలిపారు. ఇతర బ్రాండ్ల నెయ్యి నందిని నెయ్యి నాణ్యతతో సరిపోలడం లేదని ఆయన అన్నారు.
నందిని పాల ధర పెంపుతో
“నందిని నెయ్యితో తయారయ్యే లడ్డూలు ఇక ఉండవని అనుకుంటున్నాను. నందిని మార్కెట్లో అత్యుత్తమ నెయ్యిని అందజేస్తుంది. అన్ని నాణ్యతా తనిఖీల్లో నందిని నెయ్యిని పరీక్షిస్తారు. ఏదైనా బ్రాండ్ నందిని కంటే తక్కువ ధరకు సరఫరా చేస్తే, నాణ్యతలో రాజీ పడుతుందని నేను భావిస్తున్నాను ”అని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు.
దాదాపు 50 ఏళ్లుగా తిరుమల లడ్డూలను తయారు చేసేందుకు నందిని నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. శ్రీవారిని దర్శించుకునే భక్తులు.. తప్పనిసరిగా లడ్డూలు స్వీకరిస్తారు. తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం.
లడ్డూలను శ్రీవారికి నైవేద్యంగా పరిగణిస్తారు భక్తులు. ఇది సాధారణంగా భక్తులు ఇంటికి తీసుకువెళ్లే శ్రీవారి ప్రసాదం. కర్ణాటక మంత్రివర్గం.. నందిని పాల ధర లీటరుకు రూ.3 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రూ.39 ధర ఉండే టోన్డ్ పాలను ఆగస్టు 1 నుంచి లీటరుకు రూ.42కు విక్రయించనున్నారు. మిగతా చోట్ల లీటరుకు రూ.54-రూ.56 మధ్య విక్రయిస్తారు. తమిళనాడులో లీటరు పాల ధర రూ.44గా ఉందని అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
ఆరోపణలు అవాస్తం: టీటీడీ ఈవో
నందిని నెయ్యిని కొనుగోలు చేసేందుకు టీటీడీ అనుమతించడం లేదని కేఎంఎఫ్ అధ్యక్షుడు బీమానాయక్ చేసిన ఆరోపణలు అవాస్తవమని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ‘మార్చిలో నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఈ-టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు.
ఇందులో కేఎంఎఫ్ పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఫెడరేషన్ నుంచి టీటీడీ 20 ఏళ్లుగా నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ-టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. టెండర్లలో ఎల్1గా వచ్చిన వారి నుంచి కొనుగోలు చేస్తామని తెలిపారు.
ఇదే సమయంలో ఓ పర్యాయం కేఎంఎఫ్ ఎల్2గా రాగా ఎల్1తో మాట్లాడి ఆ మేరకు నిబంధనలకు కేఎంఎఫ్ నుంచి నెయ్యిని కొనుగోలు చేశామని వివరించారు. టీటీడీ నామినేషన్ పద్ధతిలో ఏ నిత్యావసర వస్తువులనూ కొనుగోలు చేయదని స్పష్టం చేశారు.
ReplyForward
|