Bathukamma Dussehra : విజయదశమి పండుగను దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటాం. హిందువుల ఆరాధ్య పండుగలలో దసరాకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. నేపాల్, భూటాన్, మారిషస్, మలేషియా, ఇండోనేషియా, కాంబోడియా వంటి దేశాల్లో విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. మన పక్కనే ఉన్న నేపాల్ లో దసరా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.
నేపాల్ లో అతి పెద్ద పండుగల్లో విజయదశమికి విలువ ఇస్తారు. చిన్నవారంతా తప్పనిసరిగా పెద్దలను కలుసుకుంటారు. పెద్దలు వారి నుదుట తిలకం దిద్ది ఝమరా (గరిక) ఆకులు వారి చేతికి ఇచ్చి ఆశీస్సులు అందజేస్తారు. ఆ ఆకులను చెవిలో పెట్టుకుంటారు. నేపాల్ లోని శక్తి ఆలయాల్లో నవరాత్రుల సందర్భంగా తాంత్రిక పూజలు, జంతు బలులు జరుగుతాయి.
నేపాల్ కన్నా భూటాన్ లో హిందువుల జనాభా తక్కువే. అయినా ఇక్కడ కూడా దసరా వేడుకలు ఘనంగానే జరుపుకుంటారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో లక్ష్మీనారాయణ ఆలయంలో నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని బాలి దీవిలో ఆలయాలన్ని నవరాత్రి వేడుకలు కళకళలాడతాయి. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో దసరా ఉత్సవాలు జరుపుకోవడం సహజమే.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. వినోద కార్యక్రమాలు, ఆటల పోటీలు, పాటల పోటీలు కూడా జరుపుకుంటారు. నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని ఆరాధించి నిమజ్జనం చేస్తారు. ఇలా మనదేశంతో పాటు వివిధ దేశాల్లో విజయదశమిని ఘనంగా జరుపుకోవడంతో మన సంప్రదాయాలు ఎక్కడున్నా హిందువులకు ఆదర్శప్రాయంగానే నిలుస్తాయనడంలో సందేహం లేదు.