JanaSena alliance : చంద్రబాబు అరెస్టుతో కొంత డీలా పడ్డ టీడీపీ శ్రేణులు పవన్ ప్రకటనతో బూస్ట్ అయ్యాయి. అదే సమయంలో జనసేనలోనూ కొత్త కొత్త ఉత్సాహం మొదలైంది. ఇదే సమయంలో అధికార పార్టీలో కలవరం మొదలైంది.ఈ రెండు పార్టీలో కలిసి వస్తే తాము పెట్టాబేడా సర్దుకోవాల్సి వస్తుందని వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. దీంతో ఇప్పటికే వైసీపీ నేతలు తమ నోటికి మరింత పదును పెట్టారు. జనసేన బలమేంటో నిరూపించాలంటే అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టాలని సవాళ్లు విసురుతున్నారు.
అయితే వైసీపీ నేతల సవాళ్లకు ముందుకు సాగితే 2019 సీన్ రిపీట్ కాక తప్పదు. రెండు పార్టీలు గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. పవన్ ప్రకటన ప్రకారం రెండు పార్టీలు ఉమ్మడిగా సరైన ప్రణాళికతో ముందుకు సాగితే 2014కు మంచి ఫలితాలను రానున్న ఎన్నికల్లో సాధించవచ్చు.
2014 ఎన్నికలలో జనసేన పార్టీ తన అభ్యర్థులను బరిలో దించలేదు. టీడీపీ + బీజేపీ కి మద్దతు ఇచ్చింది. వైసీపీ పార్టీ వ్యతిరేకుల ఓట్లు చీలిపోకుండా ఈ మద్దతు ఉపయోగపడింది. అలాగే 2019 ఎన్నికల్లో మూడు పార్టీలు విడివిడిగా పోటీచేసినప్పటికీ బీజేపీ..టీడీపీ పార్టీ గెలుపుని కానీ వైసీపీ ఓటమిని నిర్ణయించే స్థాయిలో అప్పుడు లేదు. ఇప్పుడు అదే పరిస్థితి. ఒకరకంగా నోటా ఓట్ల కంటే తక్కువ ఓటు శాతం బీజేపీ ది. కానీ జనసేన మాత్రం సుమారు 30 నుంచి 40 స్థానల్లో టీడీపీ గెలుపుని అడ్డుకుని వైసీపీ విజయానికి కారణమైంది. రెండు పార్టీలు దమ్ముంటే విడివిడిగా రావాలంటూ వైసీపీ చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాల వెనుక ఉన్న పరమార్ధం కూడా ఇదే.
గత ఎన్నికల ఫలితాల లెక్కలతో ఈ “రెండు పార్టీల పొత్తు వైసీపీ చిత్తు”.. అంటూ సామజిక మాధ్యమాలలో లెక్కలతో సహా వివరిస్తున్నారు టీడీపీ, జనసే అభిమానులు. గత ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచిన పేర్ని నాని మచిలీపట్నం, నగరి రోజా,సత్తెనపల్లి అంబటి, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, అవంతి భీమిలి…. ఇలా మీడియా ముందు అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకొనే నేతలందరిది ఓట్ల చీలికతో గెలుపే. పేర్ని నాని.. 66141 ఓట్లను నమోదుచేసుకోగా.., టీడీపీ 60290 ఓట్లతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. జేఎస్పీ 18807 ఓట్లను చీల్చగలిగింది.
రెండు పార్టీల ఓట్లను లెక్కిస్తే 79097 అది నాని విజయాన్ని నివారించి ఉండేది. అలాగే నగరిలో రోజా మెజారిటీ 2500 ఓట్లు మాత్రమే. బాబు ఇంటి మీద దాడికి వెళ్లిన జోగి రమేష్ నియోజక వర్గంలో కూడా జనసేన 25 వేల ఓట్లను సాధించింది. టీడీపీ + జేఎస్పీ=79814, వైసీపీ =61920. పొత్తు ఉండకూడదు అని వైసీపీ చేస్తున్న హడావుడికి ఇవి కొన్న ఆధారాలు మాత్రమే. అసలు ఈ వైసీపీ నేతలు స్వామి భక్తి చుపించాల్సింది జగన్ కు కాదు పవన్ కి అనేది ఈ గణాంకాలు చూస్తున్న వారికి అర్ధమవుతుంది.
సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఆయా పార్టీల ఓటు శాతాన్ని తగ్గిస్తుంది. అందునా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజల పై పడిన పన్నుల భారం, నిత్యావసరాల పెరుగుదల, కరెంట్ బిల్లుల మోతతో సామాన్య మధ్యతరగతి గడిచిన ఐదేళ్లలోనే దిగువ మధ్యతరగతి స్థాయికి చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ కొన్ని వర్గాల ఓట్ల కోసం పథకాల పేరుతో పంచిపెడుతున్న మొత్తాన్ని మధ్యతరగతి నడ్డి విరిచి వసూలు చేస్తుందనే భావన ఇప్పటికే సాధారణ జనాల్లో పాతుకు పోయింది. పవన్ వారాహి యాత్రతో సామజిక పరంగా తనకు పట్టుందని భావించే ఉభయ గోదావరి జిల్లాలలో జనసేను మరింత బలోపేతం చేశారు. గతంకంటే తన పార్టీ ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడంలో వారాహి యాత్ర పవన్ తోడయ్యింది.
నిత్యం ప్రజల్లో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు, యువగళం యాత్రతో లోకేష్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు బాబు అరెస్టుతో రాష్ట్రంలో మోజార్టీ ప్రజలు చంద్రబాబు పై , ఆపార్టీ పట్ల సానుభూతి పెరిగింది. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రాక, ఉద్యోగులకు సమయానికి జీతాలు తీసుకోలేక ఇలా ప్రతి ఒక్కరిలో తీవ్ర వ్యతిరేకత మొదైలంది. గత ఎన్నికల ఓటు శాతం గణాంకాలను నిలపెట్టుకుని…, ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకొని.., పార్టీ నేతల యాత్రల ద్వారా సంపాదించుకున్న మైలేజ్ ని దృష్టిలో ఉంచుకొని చూసినా కూటమి గెలుపు కష్టమేమీ కాదు. అలా అని ఏమరుపాటుగా ఉన్న వైసీపీ కేంద్రం తో తనకున్న రహస్య బంధం తో రెండు పార్టీలను చావు దెబ్బ కొట్ట గలదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.