ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకి రాజకీయ వేడి పెరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన ఐదు ప్రధాన పార్టీలుగా ఉన్న పోటీ మాత్రం టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్యలో ఉంది.. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సైలెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల జరిగిన ఏమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో జోరు మీద ఉన్న చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలతో పాటు చంద్రబాబు తనయుడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్రతో ముందుకు సాగుతున్నారు.
చంద్రబాబు పర్యటనలో భాగంగా ఇటీవల మంత్రి జోగి రమేష్ నియోజక వర్గంలో పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు భారీ గజమాలతో స్వాగతం పలికేందుకు సిద్దపడ్డారు. టీడీపీ శ్రేణులకు పోటీగా వైసీపీ శ్రేణులు జై జోగి రమేష్.. అనే నినాదాలతో ఒక్కసారిగా చంద్రబాబు పర్యటనలో అగ్గి రాజుకుంది… టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు….
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో చంద్రబాబు పర్యటన మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. చంద్రబాబునాయుడు రోడ్ షో ను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ ప్రకటించింది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు రోడ్డెక్కారు. టీ షర్టు, నల్ల బెలూన్లు ధరించి బాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మంత్రి సురేష్ కార్యాలయం వైపు దూసుకు వచ్చారు. ఆదిమూలపు సురేష్ రోడ్డుపై తన షర్ట్ ను విప్పేసి చంద్రబాబుపై ఆగ్రహం తో మాట్లాడారు.చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని, దళితులను అవమానించిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత లేదన్నారు.
దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ చంద్రబాబు అవహేళన చేశారని, ఇప్పుడు దళితుల ఓట్ల కోసం ప్రేమ ప్రదర్శిస్తున్నారని మంత్రి సురేష్ ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆదిమూలపు సురేష్ రోడ్డుపై తన షర్ట్ ను విప్పేసి సవాల్ విసరడంతో ఏపీలో రాజకీయాలు తోపులాట నుంచి చొక్కాలు చింపుకునే వరకు వచ్చాయని, ఎన్నికల వరకు ఈ రెండు పార్టీల మధ్య వైరం ఎలా ఉంటుందో అని ప్రజలు అనుకుంటున్నారు.