Chennai : చేపలు చిక్కుతాయని జాలారి వల వేస్తే వలకు కోట్లు విలువైన జీవాలు చిక్కాయి. దీంతో జాలరి పంట పండినట్లయ్యింది. ఒకే చోట స్థిరంగా ఉండని, గుంతల్లో పెరిగే ఔషధ గుణాలున్న చేప పిల్లలు జాలారి వలకు చిక్కాయి. వాటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఈ చేప రెక్కలు గరుకుగా, చిన్నగా ఉంటాయి. శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేసే దారాన్ని చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారట. సౌందర్య సాధనాలు, కొన్ని రకాల మందుల తయారీలో ఈ చేపనే వినియోగిస్తారు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఇది ‘సీ గోల్డ్ ఫిష్..’ అయ్యింది.
జాలర్ల వేటలో చేపలు, రొయ్యలు, పీతలు వంటివి చిక్కుతాయి. వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తారు. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో అత్యంత అరుదైన చేపలు వలలో చిక్కుతుంటాయి. అవి కాసుల పంట పండిస్తాయి. సుడి బాగుంటే 3 నుంచి 4 నెలలు కష్టపడితే వచ్చే ఆదాయం.. ఒక్క రోజులో వస్తుంది. తాజాగా చెన్నై తంజావూరులో ఓ మత్స్యకారుడికి ఇలాంటి లక్ కలిసి వచ్చింది.
‘అదిరంపట్టినం’కు చెందిన జాలరి రవి ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వల విసిరాడు. వల లాగిన తర్వాత.. ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఎందుకంటే ఆ వలలో చిక్కింది గోల్డ్ ఫిష్ (కచిడి చేప). అది కూడా 25 కిలోలు ఉంటుంది. ఇక తన పంట పండిందని ఆనందపడ్డాడు. ‘ప్రోటోనిబియా డయాకాంతస్’ అనేది శాస్త్రీయ నామం ఈ చేపది. బ్లాక్ స్పాటెడ్ క్రోకర్ అని పిలుస్తారు.
కచిడి చేపను వేలం వేసేందుకు మార్కెట్కు తెచ్చాడు రవి. ఇది చాలా అరుదుగా దొరికే చేప కావడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడ్డారు. రూ.1000తో ప్రారంభమైన చేప వేలం రూ.1,87,770కి వద్ద ముగిసింది. ఇది సాధారణంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రా తీర ప్రాంతాల్లో ఉంటుంది. తమిళనాడు తీరంలో చాలా అరుదుగా కనిపిస్తాయని మత్స్యకారులు తెలిపారు.
ఈ చేప గాల్ బ్లాడర్ను శస్త్ర చికిత్సలో దారంగా ఉపయోగిస్తారు. సింగపూర్లో, ఖరీదైన వైన్లను శుభ్రం చేయడంలో దీని రెక్కలను వాడతారట. దీని మాంసాన్ని సౌందర్య సాధనాల తయారీకి ఉపయోగిస్తారట. మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారు. ఈ చేపలకు ఔషధ గుణాలున్నాయని చెబుతారు.