Reserve Bank : ఇటీవలే 2000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే సమయంలో రూ.500 నోట్లు కూడా రద్దు చేస్తారని ప్రచారం జోరుగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రూ.500 నోట్ల రద్దు ఖాయమంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. రూ. 2000 నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సామాన్యుల్లో అనేక సందేహాలు మొదలయ్యాయి అయితే ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువు ప్రకటించింది పెద్ద నోట్ల రద్దు ఉపసంహరణ అంశం పైన కూడా ఆర్బీఐ పూర్తి స్పష్టతనిచ్చింది.
గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ వివిధ కోణాల్లో ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. అయితే తాజాగా రూ.500 నోట్ల రద్దుపై చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రూ. 500 నోట్లను రద్దు చేసే ఉద్దేశమేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ ప్రకటించారు. నోట్లను వెనక్కి తీసుకొని రూ. 1000 నోట్లను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ ఆలోచిస్తున్నదనే ప్రచారాన్ని అయినా తోసిపుచ్చారు. రూ. 2000 నోటు ఉపసంహరణ నేపథ్యంలో కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ఇటువంటివి పరిగణలోనికి తీసుకోవద్దని రూ. 500 నోట్ల రద్దు పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
అయితే గత నెల 19 న రూ. 2000 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. వీటి మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు ప్రకటించింది. ప్రకటించిన మూడు వారాల్లోనే 50 శాతం నోట్లు డిపాజిట్ చేశారని గవర్నర్ శక్తి కాంత్ దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 85% తిరిగి వచ్చాయని తెలిపారు అయితే చివరి వరకు వేచి ఉండవద్దని, వెంటనే డిపాజిట్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. బ్యాంకులో అందుకు తగ్గట్లుగా కరెన్సీ అందుబాటులో ఉందని తెలిపారు. అదే సమయంలో రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశ పెట్టడం లాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో సామాన్య ప్రజల్లో నెలకొన్న అపోహలు సందేహాలకు ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు.
అయితే గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కేంద్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు లభించక చాలా మంది బ్యాంకులకు పరుగులు తీశారు. దీంతో ఈసారి ఆర్బీఐ పక్కా ప్లాన్ తో ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసింది. దీంతో పాటు రాజకీయ పార్టీలు, నాయకుల వద్ద ఉన్న పెద్ద నోట్ల వ్యవహారంపై కూడా ఓ కన్నేసినట్లు సమాచారం. ఏదేమైనా ఈసారి గతంలోలాగా ఇబ్బందులు తలెత్తకుండా చూసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత గడువు ఇవ్వడం ద్వారా బ్యాంకుల్లో కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసిందని అందరూ అనుకుంటున్నారు.