ఏపీ లో ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మాములుగా సంఖ్యాబలం చూస్తే ఎలాంటి పోటీ లేకుండా అధికార వైసీపీకి 6 స్థానాలు ప్రతిపక్ష టీడీపీకి ఒక స్థానం దక్కాలి. కానీ టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. అలాగే వైసీపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు టీడీపీకి మద్దతుగా నిలిచారు దాంతో పోటీ రసవత్తరంగా మారింది.
ఒక్కో ఎమ్మెల్సీ ని ఎన్నుకోవడానికి 22 మంది ఎమ్మెల్యేల చొప్పున కేటాయించాడు జగన్. అంటే వైసీపీకి ఉన్న 151 మంది శాసన సభ్యులకు తోడు నలుగురు టీడీపీ సభ్యులు అలాగే జనసేన కు చెందిన ఒక శాసన సభ్యుడు మొత్తంగా 156 మంది మద్దతు వైసీపీకి ఉంది. అయితే ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు అంతేకాదు వాళ్ళు ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని స్పష్టం చేశారు కూడా…… అంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని చెప్పకనే చెప్పారు. దాంతో వైసీపీ బలం 154 కు చేరింది. అయితే ఇందులో మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా అసంతృప్తితో ఉంటె జగన్ కు గట్టి షాక్ తగలడం ఖాయం.
ఇక ఎమ్మెల్యే కోటాలో కూడా ఒక ఎమ్మెల్సీ గెలవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది టీడీపీ. ప్రస్తుతం టీడీపీ బలం 19 కాగా ఇద్దరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలతో 21 కి చేరింది టీడీపీ బలం. అయితే ఎమ్మెల్సీని గెలవాలంటే 22 మంది సభ్యుల మద్దతు అవసరం. మరి మరో ఎమ్మెల్యే ఎవరైనా టీడీపీకి మద్దతు ఇస్తాడా ? అనే కోణంలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఈరోజు ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.