ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి నెలకొంటుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి సభలో పాల్గొన్నాడు నరేంద్ర మోడీ. ఆ సభలో మాట్లాడిన మోడీ ….. మేము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చాడు. అయితే ఎన్నికలు అయ్యాక బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ ప్రధాని అయ్యాడు కానీ ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా దక్కలేదు.
దాంతో అప్పటి నుండి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ ప్రశ్నిస్తూనే ఉన్నాయి ఏపీకి చెందిన పలు పార్టీలు. కానీ ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతూనే ఉంది కేంద్రం. తాజాగా ఇదే విషయం గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రస్తావించగా అప్పుడు ఎవరో రాసిచ్చిన కాగితాన్ని మోడీ చదివారని, ఈ విషయం మోడీకి పూర్తిగా తెలియదని …… ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే దేశంలోని మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారని దాంతో దేశంతో అశాంతి నెలకొంటుందని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కిషన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఏపీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగల మంత్రిగా , తెలుగు రాష్ట్రాల వ్యక్తిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి ? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.