MP Avinash Reddy : వైఎస్ వివేకానంద హత్య కేసులో విచారణ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి రావాలని సీబీఐ కోరింది. వివేకానంద హత్య కేసులో నిందితుడిగా అవినాశ్ పేరును చేర్చింది సీబీఐ. అయితే, ఇప్పటి వరకు అవినాశ్ రెడ్డిని 4 సార్లు విచారించిన సీబీఐ. ఈ రోజు మారోసారి విచారించనుంది. ఆయనను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే..
జూన్ నెల చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం అవినాశ్ ను ఆదేశించింది.. అవినాష్ ముందోస్తు బెయిల్ పొందిన తరువాత మూడో సారి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటలకు సీబీఐ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా ఇప్పటికే అవినాష్ ముందోస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు గతంలో భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ సమయంలో ఎంపీకి సీబీఐ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సహనిందితుడిగా..
వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల జాబితాలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేరును సీబీఐ చేర్చింది. ఇప్పటి వరకు సాక్షిగానే విచారించిన బ్యూరో తాజాగా నిందితుడిగా విచారించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు అవినాశ్ రెడ్డి కూడా సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లో అవినాశ్ రెడ్డిని సహ నిందితుడిగా సీబీఐ చేర్చింది. వివేకా హత్య తర్వాత సహ నిందితులుగా డీ శివశంకర్రెడ్డి, టీ గంగిరెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి ఆధారాలను ధ్వంసం చేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం వ్యక్తం చేసింది. దీంతో మొదటిసారి అవినాశ్ రెడ్డి పేరు నిందితుల జాబితాలోకి ఎక్కింది.
సీబీఐ విచారణపై ఆగ్రహం..
వివేకా హత్యకు ముందు జరిగిన విషయాలను సీబీఐ పూర్తిగా పక్కన పెట్టి తన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిందని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సరైన ట్రాక్ లో వెళ్లడం లేదని, సీబీఐ ఈ స్థాయికి దిగజారడం మంచిది కాదన్నారు. వివేకానంద రెడ్డి స్వయంగా రాసిన లేఖను ఇప్పటి వరకూ పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో బ్యూరోలో చేసిన తప్పిదాలనే ఇప్పుడు వచ్చిన వారు కూడా చేస్తున్నారని మండిపడ్డారు.
వివేకా మరణించిన సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చిందే తనని ఈ విషయం గుర్తు చేసుకోవాలని బ్యూరోకు సూచించారు. ఆయన మరణం గురించి ముందుగా తెలిసింది ఆయన అల్లుడికేనని, దాదాపు గంట ముందు తెలిసినా పోలీసులకు ఎందుకు చెప్పలేదనే కోణంలో ఎందుకు విచారించడం లేదని తప్పుబట్టారు. సమాచారం దాచిన అతడిని విచారించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి కీలక అంశాలను సీబీఐ విస్మరించడంలో అర్థం ఏంటని అవినాశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
హత్య చేసి అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఎలా కీలకంగా భావిస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ సీబీఐ అప్రూవర్ కు బెయిల్ ఇచ్చి సహకరించడం దుర్మార్గమని అవినాశ్ కామెంట్ చేశారు.