Newly Married Couple : బంధాలు ఎప్పుడు ముడిపడతాయో.. ఎప్పుడు తెగిపోతాయో.. ఎవరికీ తెలియదు. కొన్ని సందర్భాల్లో మనవాళ్లే మనకు శత్రువులుగా కనిపిస్తారు.. బయటివారు స్నేహితులుగా మారిపోతారు. మనిషి జీవితం బంధాలు, అనుబంధాలు, బంధుత్వాల.. మధ్యనే సాగుతుంది. ఇవి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఎవరి మదిలో ఏముంటుందో.. ఎప్పుడు ఎవరితో మనస్పర్థలు వస్తాయో.. తెలియదు. ఏదన్నా సమస్య ఉంటే నలుగురితో మాట్లాడితే దానికి ఉపశమనమో, ఉపాయమో దొరుకుతుంది. ప్రస్తుత సమాజంలో అలాంటి అవకాశం ఉండడం లేదు. ఎవరికీ వారే సమాధానం, పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. అవి దొరకకపోతే క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది మంచో, చెడో ఆలోచించే పరిణితి కూడా ఉండని సమాజం తయారువుతోంది.. ఇదే బలవన్మరణాలకు దారితీస్తుంది..
పెళ్లై ఐదు రోజులైనా కాలేదు..ఏం జరిగిందో.. ఏం అనుకున్నారో.. ఏమో నవ వధూవరులు గోదావరిలో దూకారు. వరుడు ఒడ్డుకు చేరుకోగా.. వధువు గల్లంతయ్యింది. ఈ సంఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగింది. వధువు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన వరుడు కె.శివరామకృష్ణతో వడలికి చెందిన కోరాడ సత్యవాణి(19)కి ఈ నెల 15వ తేదీన వివాహం జరిగింది. మంగళవారం(20)న రాత్రి వడలి నుంచి ఇద్దరూ సినిమాకు వెళ్తున్నామని చెప్పి బైక్ పై బయటకు వెళ్లారు. తర్వాత ఏం జరిగిందో.. ఏమైందో గాని.. సిద్ధాంతం వంతెన వద్ద వారి బండి, వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నట్టు చెబుతున్నారు. వరుడు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
శివరామకృష్ణను తణుకులోని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకురాగా, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. శివరామకృష్ణ ఏదో చేసి నాటకం ఆడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.