- వెళ్లేది విశాఖకా..ముందస్తుకా..?
AP CM plan : ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకూ ఎన్నికల వేడి పెరుగుతున్నది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ తమ తమ ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. అయితే ఇక్కడ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ప్లాన్ ఏంటనేది అంతుచిక్కడం లేదు. ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే ఆయనకు పార్టీ పరిస్థితి, ప్రజల చర్చ, తదితర వివరాలపై ఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఆ ఐదు రాష్ట్రాలతోె..
మరోవైపు ఎన్నికల సంఘం ఐదు రాష్ర్టాల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. నవంబర్లో ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఐదు రాష్ర్టాలతోనే ఎన్నికలకు సిద్ధమవ్వాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. సెప్టెంబర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి, ముందస్తుకు వెళ్తారని అంతా అనుకుంటున్నారు. ఇందు కోసం జగన్ ఇప్పటికే తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారని, కేంద్ర పెద్దలను కలిసి అనుమతి కూడా తీసుకున్నారని ఏపీలో టాక్ నడుస్తోంది. విశాఖకు సెప్టెంబర్లో మకాం మారుస్తానని చెప్పిన సీఎం ముందస్తుకు వెళ్లేందుకు కూడా అదే నెలలో సిద్ధమవుతున్నారని చర్చ సాగుతున్నది.
అచితూచి అడుగులు..
అయితే కేంద్రం ఎలాంటి అడుగులు వేస్తుందో తెలియక జగన్ కొంత సంశయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో ఆయన గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు కేసులు న్యాయస్థానాల్లో తుది దశకు చేరుకుంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఎన్నికలు ఆలస్యమైతే రాష్ర్టపతి పాలన ఖాయమవుతుంది. దీంతో జగన్ తన అనుయాయులు, కేంద్రంలో సహకరించే నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఆరు నెలల్లో లోక్ సభ ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో జగన్ అడుగులు పడబోతున్నాయనేది ఇప్పుడు చర్చ సాగుతున్నది. ఏదేమైనా కేంద్రం మద్దతు ఉంటేనే జగన్ ప్రస్తుతం ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంటుంది.