South Africa VS India : వరల్డ్ కప్ 2023 లో టీమిండియా దూసుకెళ్తున్నది. ఎనిమిది వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లతో టీమిండియా సమష్టిగా మెరుగైన ప్రదర్శన చూపుతున్నది. ఇక ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ను అవలీలగా గెలుచుకుంది. ఇప్పటికే సెమీస్ కు చేరిన టీమిండియాకు ఈ విజయం మరో బోనస్.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఛేజింగ్ లో 400 పరుగులను కూడా అలవోకగా కొట్టేస్తున్న దక్షిణాఫ్రికా దారుణంగా చతికిలపడింది. టీమిండియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కనీసం మూడెంకల స్కోరు కూడా చేయకుండానే 83 పరుగుల వద్ద చేతులెత్తేసింది. దీంతో రోహిత్ సేన 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి సఫారీల ఆట కట్టించాడు. షమీ, కుల్దీప్ యాదవ్ లో చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సఫారీల జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డికాక్ ను సిరాజ్ బౌల్డ్ చేయగా, ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా రంగంలోకి దిగాడు. ఇక ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరడం మొదలుపెట్టారు. 83 పరుగులకు దక్షిణాఫ్రికా జట్టు అలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్కో జానెసన్ ఒక్కడే 14 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక బర్త్ డే బాయ్, టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. వన్డేల్లో తన 49 వసెంచరీని నమోదు చేశాడు. దీంతో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ సమం చేశాడు. ఈ మ్యాచ్ లో 121 బంతుల్లో 10 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. ఇక మరో ఆటగాడు శ్రేయాస్ అయ్యర్(77) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ఎంగిడీ, షమ్సీ, జానెసన్ చెరో వికెట్ పడగొట్టారు.