Snakebite : వైద్యరంగంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నా..ఇప్పటికీ పాముకాటు మరణాలు తగ్గడం లేదు. గ్రామాల్లో ఇప్పటికీ పాముకాటుతో పలువురు మరణిస్తూనే ఉన్నారు. పాముకాటు కుట్టిందని తెలియకపోవడం, ఒక వేళ తెలిసినా పల్లె నుంచి దగ్గరలోని పట్టణం వచ్చేసరికి సమయం మీరిపోవడంతో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. అడవులు, కొండలు, లోయ ప్రాంత జనాలకు ఈ కష్టాలు మరింత ఎక్కువ. ఒక్కోసారి హాస్పిటల్ కు సమయానికే తీసుకొచ్చిన పాముకాటు విరుగుడు మందు దొరకడం లేదు. ఇక ఇలాంటి చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
పాముకాటుకు విరుగుడు కనిపెట్టడంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సీ)సైంటిస్టులు సఫలమయ్యారు. అమెరికాకు చెందిన స్కిప్స్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. హెచ్ ఐవీ, కొవిడ్-19 వైరస్ లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ఈ పరిశోధనకు ప్రాతిపదికగా నిలిచింది.
తమ సింథటిక్ యాంటీబాడీ త్రాచుపాము, నాగుపాము(కింగ్ కోబ్రా), కట్లపాము, బ్లాక్ మాంబా వంటి పాముల విషాన్ని ఎదుర్కోగలదని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారుచేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు హానికరంగా పరిణమిస్తోంది. తాజా పరిశోధన వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్ యాంటీబాడీలను తయారుచేయడం వీలవుతోంది.