పోలీసులపై జులుం ప్రదర్శించి అరెస్టైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే న్యాయస్థానం ఆమెకు బెయిల్ ఇచ్చినప్పటికీ షరతులు పెట్టింది. షర్మిల బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. షర్మిలకు బెయిల్ ఇచ్చేందుకు ఇద్దరి వ్యక్తులను పూచీకత్తుగా తీసుకుంది.
ఒక్కొక్కరి వద్ద నుంచి ష్యూరిటీగా రూ.30 వేలను డిపాజిట్ చేయించుకుంది. అంతేకాక షర్మిల విదేశాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని షరతు పెట్టింది. సంబంధిత పోలీసు అధికారుల విచారణ సహకరించాలని తెలిపింది.
మరోవైపు సోమవారం పోలీసులపై చేయి చేసుకున్నందుకుగాను షర్మిలపై ఐపీసీ 332,353,427,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె నాంపల్లి కోర్ట్లో హాజరు పర్చగా న్యాయమూర్తి షర్మిలకు 14 రోజుల జ్యుడిషల్ రిమాండ్ విధించారు. అయితే ఇవాళ షర్మిల నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా..న్యాయమూర్తి ఆమెకు బెయిల్ ఇచ్చారు.