Bhargava : సజ్జల రామకృష్ణారెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి జనబలం లేకున్నా ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి. ప్రభుత్వంలోని శాఖలు, వ్యవస్థలను ఎలా నడుపాలో తెలిసిన ఘనుడు ఆయన. అలాంటి రామకృష్ణారెడ్డి కుమారుడు అంటే ఎలా ఉండాలి..? ఇది మన అంచనాకే అందదు.. కానీ ఆయన ఉన్న స్థితి చూస్తే మాత్రం జాలేయక కూడా మానదు. ప్రస్తుతం ఆయన వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ బిగినర్స్ మిస్టేక్స్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు సజ్జల భార్గవ.
తెలుగుదేశం పార్టీ మహానాడులో తమ పార్టీ మేనిఫేస్టోను రిలీజ్ చేసింది. దీంతో వైసీపీ శిబిరంలో కొంత అలజడి నెలకొన్న మాట వాస్తవమనే చెప్పారు. మేనిఫేస్టోలో ఉన్నవి ఎలా అమలు చేస్తారని వైసీపీ ప్రశ్నించకముందే.. సంపద సృష్టి అంటూ టీడీపీ ముందే అస్త్రం సందించింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి భార్గవ రంగంలోకి దిగారు. సంపద సృష్టిలో జగనే నెంబర్ 1 అని చెప్పుకోవాలనే ఉత్సుకతతో గణాంకాలతో సహా ఒక పోస్టర్ ను సిద్ధం చేశాడు. ఆయనే స్వయంగా తన వాల్ పై పోస్ట్ చేసుకున్నాడు. పైగా సంపద సృష్టి అంటూ ట్యాగ్ లైన్ కూడా వేసుకున్నాడు. అయితే అందులోని పిగర్స్, గ్రాఫిక్స్ ను చూసి టీడీపీ వాళ్లతో సహా జనం కూడా భళ్లున నవ్వారు.
జగన్ హయాంలో జీఎస్డీపీ పెరిగిందని భార్గవ గ్రాఫిక్ చేయించారు. కానీ గణాంకాలు పరిశీలిస్తే 2021-22తో పోలిస్తే 2022-23కు రూ. 2 లక్షల కోట్ల వరకూ జీఎస్డీపీ తగ్గింది. కానీ మ్యాప్ లో మాత్రం పొడుగైన బార్ తో చూపారు. తగ్గితే ఎందుకు పొడుగ్గా బార్ వేశారు అంటూ చాలా మంది ప్రశ్నించారు. అయితే దానికి సమాధానంగా పక్కన కనిపించీ, కనిపించని అక్షరాల్లో ఎస్టిమేటెడ్ (అది ఇంకా తక్కువే ఉంటుంది) అని రాశారు. దీంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 2023-24లో రెండు నెలలు కూడా కాలేదు అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. ఏకంగా రూ. 14 లక్షల కోట్లు జీఎస్డీపీ ఉంటుందిని అంచనా వేశారు. ఇక దీని పక్కన ఎక్స్పెక్టెడ్ అని మళ్లీ కనిపించని అక్షరాల్లో రాశారు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో మంచి లాఫింగ్ స్టాక్ అయిపోయింది. ప్రజా మద్దతు లేకుండా ఏకంగా ప్రభుత్వాన్ని నడిపేంత సత్తా ఉన్న సజ్జల కుమారుడా.. ఈ గ్రాఫిక్స్ వేసిందంటూ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఏంట్రా పాపం సజ్జలకు ఈ ఖర్మ అంటున్నారు.