Biden Decision : వెనెజువెలా, మెక్సికో, కొలంబియా వంటి దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ సమస్యలను తీసుకువచ్చింది. అమెరికలో పంట కోతలు, కూరగాయలు, పండ్లు తెంపడం, హోటల్స్, దుకాణాలు, భవన నిర్మాణంలో పని చేయడం వంటి వాటితో వలసదారులు జీవనాధారం పొందుతున్నారు. అయితే బైడెన్ ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల వలసదారులకు వేగంగా పని అనుమతులు లభిస్తుంటే దశాబ్ధాలుగా అమెరికాలో స్థిరపడిన వలస దారులు ఇప్పటికీ పర్మిట్లు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది వలసదారుల్లో విభేదాలు, ఉద్రిక్తతలను పెంచుతోంది. అమెరికాలో బంధువులు ఉన్నారని, వారు తమను చూసుకుంటారని గంపెడంత ఆశతో వచ్చే కొత్త వలస దారులకు పలకరింపే కరువైంది. తాత్కాలిక పని కోసం వీసా అనుమతులు పొందిన 2.7 లక్షల మంది క్యూబా, వెనెజువెలా, నికరాగువా, హైతీ దేశఆల నుంచి అక్టోబర్ లో అమెరికా వచ్చారు. సీబీపీ 1 మొబైల్ యాప్ తో మరో 3.24 లక్షల మంది మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలో ప్రవేశించనున్నారు.
బైడెన్ ప్రభుత్వం సెప్టెంబర్ లో వర్క్ వీసాతో వచ్చిన వారి కోసం 14 లక్షల ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ సందేశాలు పంపింది. వీరి కన్నా దశాబ్దాల ముందు అమెరికాకు వలస వచ్చి, పని చేస్తూ, పన్ను కడుతున్న వలస దారులకు పని పర్మిట్లు లభించకపోవడంతో వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కొత్త వలసదారులకు ఆహారం, ఆశ్రయం, ఇతర వసతులు కల్పించేందుకు 140 కోట్ల డాలర్లు మంజూరు చేయాలని బైడెన్ ప్రభుత్వం పార్లమెంట్ (కాంగ్రెస్)ను కోరింది.
వలస దారుల వల్ల తమ బడ్జెట్, అత్యవసర సేవలు దెబ్బతింటున్నాయని, ఫెడరల్ ప్రభుత్వం తమకు 500 కోట్ల డాలర్లు మంజూరు చేయాలని న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, డెన్వర్, షికాగో, హ్యూస్టన్ గవర్నర్ల దేశాధ్యక్షుడు బైడెన్కు గత నెల లేఖలు రాశారు. కొత్తగా వచ్చిన వారితో పాటు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న పాత వారికి సాధికార పని పర్మిట్లు జారీ చేయాలనే డిమాండ్ చేస్తూ వేలమంది వాషింగ్టన్లో ఇటీవల నిరసనలు తెలిపారు.