BJP : కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు ప్రకటించాయి. అయితే మరో సర్వే కూడా వచ్చేసింది. కేంద్రంలో మరోసారి కమలనాథులు అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఓపినియన్ పోల్ లో తేలింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో 318 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక విపక్షాల కూటమి ఇండియా కు సుమారు 175, ఇతరులకు 50 వరకు వస్తాయని తెలిపింది.
గతంలో వచ్చిన ఎన్డీటీవీ సీఎస్డీఎస్ సర్వే కూడా ఇదే చెప్పింది. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొంది. మోదీకి అత్యధికంగా 43శాతం, రాహుల్ గాంధీ కి 16 శాతం ఓటేసినట్లు ఈ సర్వే ద్వారా వెల్లడించింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొనుందని మాత్రం సర్వే తెలిపింది. ప్రతిపక్షాల కూటమి కూడా బలంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు బీజేపీ కి ఎదురయ్యే ప్రతికూల అంశాలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకుంటే మాత్రం ఇక ఎన్డీఏకు ఇబ్బందులు తప్పవు. గత నెలలో ఎన్డీఏ పక్షాల మీటింగ్ జరిగింది. సుమారు 34 పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. ఇక విపక్షాల కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. దీంతో 2024 ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయని తెలుస్తున్నది. ఏదేమైనా పబ్లిక్ మూడ్ ఇప్పటికైతే మోదీ వైపే ఉన్నట్లు సర్వేలను బట్టి తెలుస్తున్నది.
ఇక దేశంలో మోదీ హ్యాట్రిక్ విజయం ఖాయమనే సంస్థలన్నీ సర్వే పోల్స్ ద్వారా చెబుతున్నాయి. దేశంలో ఏ ఇష్యూ అయినా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో మోదీ సక్సెస్ అవుతున్నారు. మరోవైపు మోదీ సోషల్ మీడియాను తనకు అనుకూలంగా చేసుకొని తద్వారా లబ్ధి పొందుతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఇక ట్విట్టర్ లాంటి అగ్ర సోషల్ ఫ్లాట్ఫామ్ ను మోదీ సర్కారు ఇబ్బందులకు గురి చేస్తు్న్నదనే ఆరోపణలు గతంలో ఉన్నాయి. ఇక మోదీ సర్కారు మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమనే సర్వేలు, ప్రచారాలను విపక్ష కూటమి ఇండియా కొట్టిపడేస్తున్నది. వీటిని ఫేక్ అంటూ తోసిపుచ్చుతున్నది. ఎన్నికలకు ముందే ప్రజల అసలైన మూడ్ తెలుస్తందని చెప్పుకొస్తు్న్నది.