BJP Bus Yatra :
తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఒక అడుగు ముందు ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు పూర్తి చేసింది, ఇక అభ్యర్థుల ప్రకటనే తరువాయి అన్నట్లు గా అధిష్టానం ఉంది. శ్రేణులను కూడా పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసింది. పార్టీలో కి భారీ చేరికల నేపథ్యంలో అచితూచి అడుగులు వేస్తున్నది. ఇక మరో పార్టీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. కొంతకాలంగా సైలెంట్ పాత్ర పోషిస్తున్న బీజేపీ, బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది.
వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే వార్తల నేపథ్యంలో ప్రజల్లోకి నేరుగా వెళ్లాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో రథయాత్రలను చేపట్టాలని భావిస్తున్నది. ఈనెల 26 నుంచి ఈ యాత్రను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైనట్లుగా కూడా తెలుస్తున్నది. బాసర, సోమశిల, భద్రాచలం నుంచి మూడు విడుతలుగా ఈ యాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతున్నది. బాసర జోన్ లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలను ఒక రూట్ గా నిర్ణయించారు.
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు సోమశిల జోన్ పరిధిలో, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలలను భద్రాచలం జోన్ గా విభజించారు. 33 జిల్లాలు 19 రోజులు 4 వేల కిలో మీటర్ల యాత్రకు ప్లాన్ రెడీ చేసినట్లు తెలిసింది. రోజుకు 2 నియోజకవర్గాలు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. ఆయా చోట్ల సభలు కూడా నిర్వహించాలని ప్లాన్ రెడీ చేశారు. ఇక బీజేపీ కూడా ప్రజల్లోకి వెళ్తుండడం తో రాష్ర్టంలో ప్రచారం పర్వం హోరెత్తనుంది.