Farmhouse CM : తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో ముఖ్యనేతల ప్రచారం ముమ్మరంగా మారింది. నిన్న కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ లో పర్యటించి ఓటర్లను అర్థించారు. బీఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరారు. నేడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో మోడీ మాట్లాడుతూ ఫాం హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. పరిపాలన పక్కన పెట్టి తన సొంత పనులు చేసుకునే వారికి పట్టం కట్టొద్దని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని మరోమారు ప్రకటించారు.
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక. ఇక్కడి ఆచారాలు, వ్యవహరాలు తనకు ఎంతో నచ్చుతాయన్నారు. ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదు. భూ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియాతో భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటున్న సీఎంకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కుంభకోణాలు బయటపెట్టి కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే అని చెప్పారు. సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యం అన్నారు. అందుకే కేంద్రంలో రెండు సార్లు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరగడంతోనే మన దగ్గర ధరలు పెరిగాయని తెలిపారు.