KTR : సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలయిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడింట ఒక వంతు సీట్లు సాధించాం. ఘోరమైన పరాభవం మాత్రం పొందలేదు. కాంగ్రెస్ కు కొన్ని సీట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెప్పుకొచ్చారు. ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాకపోవడంతో అప్పులు చేశారని నిందలు వేస్తూ తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే సత్తా లేదని అంటున్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పించుకోవాలని చూస్తుండటం గమనార్హం.
పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాట్లు లేకుండా చూసుకుంటాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాపై నిందలు మోపడం భావ్యం కాదు. మోచేతిలో బలముంటే మొండి కొడవలి అయినా తెగుతుంది అన్నట్లు పాలించే సత్తా ఉంటే అప్పులు తెచ్చి అయినా పాలన గాడిలో పెట్టొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోందని దుయ్యబట్టారు.
జిల్లాల సంఖ్య కుదించాలని రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తున్నారని తెలిసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూట గట్టుకుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ మనుగడ మరింత ప్రశ్నార్థకంలో పడనుందని హెచ్చరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి ఒత్తిడి చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపడం ఖాయమన్నారు.