Bimbisara ఉత్తర భారతంలో మొదటి సామ్రాజ్యమైన ‘మగధ’ను స్థాపించిన చక్రవర్తి బింబిసారుడు. ఇతడు హర్యాంక వంశానికి చెందిన వడు. క్రీస్తు పూర్వం 558లో జన్మించిన ఈయన భట్టియా అనే గ్రామాధిపతి కొడుకు. బింబిసారుడు తన 15వ ఏటా క్రీస్తు పూర్వం 543లో సింహాసనం అధిష్టించాడు. ఆయన పాలిస్తున్న కాలంలో భరత ఉపఖండంలో మహా జనపదాలు మరియు జనపదులు అనే రెండు ప్రధాన వర్గాలు ఉండేవి. 16 గొప్ప మహా జనపదాలు ఉండేవి. ఇందులో కొన్ని స్వతంత్ర రాజ్యాలు, కొన్ని రాజవంశీకుల పాలనలో ఉండేవి.
వీటిలో ముఖ్యమైనవి నాలుగు పెద్ద రాజ్యాలు అవి అవంతి, కోసల, వత్స మరియు మగధ. దక్షిణ బిహార్ ప్రాంతమే ఒకప్పటి ‘మగధ’ రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు బ్రహ్మదత్త అనే రాజును ఓడించి అంగ రాజ్యాన్ని చేజిక్కుకుంటాడు. తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు బింబిసారుడు. తన కుమారుడి ప్రతిభ చూసిన బింబిసారుడి తండ్రి అంగరాజ్యానికి గవర్నర్ గా నియమించాడు.
ఈ రాజ్యం చేజిక్కుకోవడంతో బింభిసారుడికి బాగా కలిసి వచ్చింది. ఇది బంగాళా ఖాతం సమీపంలో ఉండడంతో సముద్ర మార్గాలపై, గంగా డెల్టాకి వెళ్లే రాజ్యాలపై మగధ రాజ్యానికి నియంత్రణ చిక్కింది. దీంతో పాటు వాణిజ్య పరంగా కూడా ఎంతో ఉపయోగపడింది. మగధ సామ్రాజ్య విస్తరణ జరిగింది.
ఆ తర్వాత బింబిసారుడు ఇతర శక్తివంతమైన రాజ్యాలపై దృష్టి పెట్టాడు. బింబిసారుడు సమర్థవంతమైన సైనికాధికారి. ఇతర రాజ్యాల సైనిక శక్తిని తెలుసుకొని లాఘవంగా చేజిక్కించుకునేవారు. ఇక కొన్ని రాజ్యాలతో వివాహ బంధం కుదుర్చుకొని లొంగదీసుకునేవారు. కోసల రాజు మహా కోసల కూతురు, ప్రసేనజిత్ సోదరి కోసల దేవిని వివాహం చేసుకున్నాడు బింబిసారుడు. కోసల దేవి మొదటి భార్య ఈమెను వివాహం చేసుకున్నందుకు కట్నంగా కాశీని పొందారు. కాశీ పట్టణం వాణిజ్య పరంగా బలోపేతమైంది. దీంతో ‘మగధ’ ఖజానా పెరుగుతూ వెళ్లింది. ఈ వివాహ బంధం ఇరు రాజ్యాల మధ్య శతృత్వాన్ని దూరం చేసింది.