Chandrababu : ఏపీ రాజకీయాలు అత్యంత హీన స్థితికి చేరాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. గత నాలుగేళ్లలో ఏపీలో పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ ఛీ అనుకునేలా పరిస్థితి తయారైంది. రాజకీయనాయకుల తిట్లదండకం చూసి, సామాన్య జనం రాజకీయాలంటేనే అసహ్యించుకునే స్థాయికి చేరింది. అయితే వైసీపీ నాయకులు ఈ తిట్ల దండకంలో కొంత ముందున్నారు. వీళ్ల తిట్ల దండకంలో ఇంట్లో ఉన్న మహిళలను కూడా రోడ్డున పడేస్తున్నారు. దీనిని చూసి చాలా మంది రాజకీయాల్లోకి రావాలంటేనే అసహ్యం చూపుతున్నారు.
అయితే ఇక్కడ జగన్ మద్దతుదారుల తిట్లను ఎల్లో మీడియా పెద్ద ఎత్తున కవర్ చేస్తుంటుంది. ఆంధ్రజ్యోతి ఒక్క అడుగు ముందుకేసి ఆ తిట్లనే హెడ్డింగ్ పెట్టేస్తుంటుంది. ఇక సీఎం జగన్ దుష్టచతుష్టయం అని చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా ను తిట్టిపోస్తుంటారు. దత్త పుత్రుడు అంటూ పవన్ పై విమర్శలు చేస్తుంటారు. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు కూడా తానే తక్కువ తినలేదన్నట్లు తిట్ల దండకం మొదలుపెట్టారు. సీనియర్ అయిన ఆయన కూడా రాజకీయాల్లో ఇలా చేయడం బాధ కలిగించే అంశమే. జగన్ ను దుర్మార్గుడు, నీచుడు అంటూ తిట్టి పోస్తుంటారు. ఇలాంటివేమీ ఎల్లో మీడియాలో కనిపించవు. ఆయనను తిడితే మాత్రం అవి గొంతు చించుకుంటాయి. జగన్ తిట్లకు కౌంటర్లు వేసే ఆ చానళ్లు, చంద్రబాబు తిడితే మాత్రం స్పందించవు. ఇదీ ఎల్లో జర్నలిజం అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి.
అయితే చంద్రబాబును మించి తిట్టేవాళ్లు ఏపీలో ఉన్నా, ఒక సీనియర్ నాయకుడిగా కొంత హుందాతనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవేమి పట్టనట్లు ఆయన కూడా సీఎం జగన్ పై విరుచుకుపడుతున్నారు. అయితే విమర్శలు రాజకీయాల వరకే ఉండాలని, ఇలా అధినేతలు కూడా మొదలెడితే సామాన్య కార్యకర్తల కు ఏం చెబుతారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏపీలో పరిస్థితి ఎప్పుడు మారుతుందా అంటూ అంతా చర్చించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేనంత హీనంగా ఏపీలో పార్టీల తీరు తయారైంది. కుల ప్రతిపాదికన ఓట్లను ఆయా పార్టీలు చీల్చుకుంటున్నాయి. ఇదే ఇప్పుడు ప్రజల మధ్య దూరం పెంచేందుకు కారణమవుతుంది.