Karnataka Formula : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఈసీ షెడ్యూల్ ఇచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. ఇక అన్ని పార్టీలు ఈ ఫైట్ కు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్ఎస్ ఒకడుగు ముందే ఉంది. ఇప్పటికే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించి, హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడుతున్నది. ఆ పార్టీ అధినేత, గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కొంతకాలంగా మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా ఉన్నారు.
అయితే ఈసారి తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బలంగా దూసుకొస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా ఆ పార్టీలో జోష్ కనిపిస్తున్నది. ఇప్పటికే 90శాతం మంది అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మరో పదిశాతం మంది ఎంపికపై కసరత్తు చేస్తున్నది. అయితే కర్ణాటకలో ఉపయోగించిన ఫార్మూలానే తెలంగాణలో వాడాలని కాంగ్రెస్ చూస్తున్నది. కర్ణాటకలో వ్యూహకర్త సునీల్ కనుగోలు చెప్పిన విధంగానే నడుచుకున్న ఆ పార్టీ, ఇక్కడ కూడా బాధ్యతలను ఆయనకే అప్పగించింది. సామాజిక వర్గాల వారీగా పట్టున్న నియోజకవర్గాల మీద ఆయన ఇప్పటికే అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చారు. జనరల్ సీట్ల లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశమివ్వడం ద్వారా పట్టు నిలుపుకోవాలని వారు చూస్తున్నారు.
ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ సహా ముఖ్య నియోజకవర్గాల్లో ఇదే ఫార్మూలాను ప్రయోగించాలని చూస్తున్నది. అయితే ఈ క్రమంలో దసరా తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. దీని ద్వారా ప్రత్యర్థి బీఆర్ఎస్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ రేసులో ముందుండాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈసారి తాము గెలిచే రాష్ర్టాల్లో తెలంగాణ ఉందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ పడుతున్నది. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత, ప్రత్యామ్నాయంగా ప్రజలకు కాంగ్రెస్ కనిపించడం. బీజేపీ కి బీఆర్ఎస్ దగ్గరగా ఉందని ఎవరిని అడిగినా చెబుతారు. ఈ క్రమంలో ఈ రేసులోకి కాంగ్రెస్ చేరింది. ఈ నేపథ్యంలో ఇటీవల చేరికలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరి కర్ణాటక ఫార్మూలాను నమ్ముకున్న కాంగ్రెస్ కు తెలంగాణలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది మరో నెలన్నర రోజుల్లో తేలిపోనుంది.