Kavita Vs Aravind : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్ర పదజాలంతో దూషించడంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముందుంటారు. తెలంగాణ యాసలో ఆయన మాట్లాడే తీరు, ప్రత్యర్థులపై విరుచుకపడే జోరుకు చాలా మంది అభిమానులే ఆయనకు ఉన్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పై ఆయన విమర్శలు చేశారు.
తెలంగాణలో ప్రజలకు బీమా రూ. 5 లక్షలు వచ్చేలా మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు రూ. 10 లక్షలు, కవితకు రూ. 20 లక్షలు బీమా చేయిస్తానని చెప్పారు. దీంతో పాటు మరికొన్ని ఆరోపణలు కవిత పై చేశారు. అయితే దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఎంపీ అర్వింద్ తమ చావు కోరుకుంటున్నారని మాట్లాడారు. అర్వింద్ భాషను ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇలాంటి మాటలు అనలేదనే కవిత చెప్పారు.
అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో నిజానికి ఆంధ్ర ప్రజలపై, నాయకులపై ఆయన చేసిన విమర్శలు మాములుగా లేవు. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే సందర్భంలో ఎన్నో మాటలు మాట్లాడారు. ఇక ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయంటూ, వారిద్దరూ ఒకే కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లడం వెనుక కవిత హస్తం ఉందని ఆరోపించారు.
ఆమెకు నిజామాబాద్ అర్బన్ టికెట్ ఇప్పించాలని కవిత ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే వీటిపై మాత్రం ఎమ్మెల్సీ కవిత స్పందించలేదు. కేవలం అర్వింద్ చేసిన బీమా వ్యాఖ్యలను మాత్రమే ఏకరవు పెడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే తనపై వచ్చిన అసలు విమర్శలను పక్కదోవ పట్టించేందుకే ఎమ్మెల్సీ కవిత ఇలా మాట్లాడారని పలువురు చర్చించుకుంటున్నారు.