ఇక కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించినప్పుడు కూడా ఆయనపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇప్పుడున్న సెక్రెటేరియట్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్లాంటి వారైతే సచివాలయం అడుగున నిజాం కాలం నాటి నేలమాలిగలు ఉన్నాయని ఆరోపించారు. ప్రకృతి సంపద,చారిత్రక కట్టడాలను నాశనం చేసేందుకే కేసీఆర్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.
అయితే ఈ విషయాలు వేటిని సీఎం కేసీఆర్ అస్సలు లెక్కనే చేయలేదు. జిల్లాల ఏర్పాటు,కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా చరిత్రలో నిలిచిపోయినట్లే అన్ని హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. అందులో భాగంగానే మొదట నూతన సెక్రెటేరియట్ను బైసన్ పోలో గ్రౌండ్లో నిర్మించాలని అనుకున్నారు.కానీ,అది రక్షణ శాఖకు సంబంధించిన భూమి. దీంతో అక్కడ కుదరలేదు. ఆ తర్వాత ఎర్రగడ్డలో కట్టాలని భావించారు.
ఇక అక్కడ కూడా సచివాలయ నిర్మాణానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏపీకి కేటాయించిన భవంతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. దీంతో వెంటనే వీటిని పడకొట్టి కేసీఆర్ తాను కలలు కన్న పద్ధతుల్లో నూతన సచివాలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు.