KCR Sentiment : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. పార్టీలన్నీ ప్రచారాస్త్రాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చనే ముందస్తు సంకేతాలతో ఇప్పటికే తమ వ్యూహాలను రూపొందించుకున్నాయి. కాగా.. గులాబీ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కదనరంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ప్రస్తుతం ఆయన కొంత అనారోగ్యంగా ఉన్నా.. కాస్త కుదుటపడగానే ప్రచార సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతుండడంతో పార్టీ శ్రేణులు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నాయి. కేసీఆర్ ప్రచారానికి సంబంధించి.. జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన షెడ్యూల్ను పార్టీ వర్గాలు ఇప్పటికే ఖరారయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి కేసీఆర్ పూర్తిగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమవుతారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసి.. దిశానిర్దేశం చేస్తారు. అదే రోజు.. హుస్నాబాద్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. అయితే.. హుస్నాబాద్లోనే తొలి సభ ఎందుకు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్లు ఎక్కువ. ప్రచారానికి కూడా సెంటిమెంట్లు పక్కాగా పాటిస్తుంటారు. కాగా.. ఇప్పుడు హుస్నాబాద్లో మొదటి ప్రచార సభ నిర్వహించడం వెనుక కూడా.. సెంటిమెంట్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి సభ హుస్నాబాద్లో ఏర్పాటు చేయడం వెనక ఉన్న కారణాన్ని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి.. అనంతరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. హుస్నాబాద్లోని కార్యకర్తల మీద నమ్మకంతోనే సీఎం కేసీఆర్ మొదటి ఎన్నికల సభ ఇక్కడ పెడుతున్నారన్నారని హరీశ్ రావు చెప్పారు. అంతేకాదు.. హైదరాబాద్కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చిన నియోజకవర్గమని, ఈ విషయాన్ని సీఎం స్వయంగా తెలిపారని హరీశ్ రావు వెల్లడించారు. ఈ సెంటిమెంట్ ప్రకారం… తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టి హ్యాట్రిక్ రికార్డు కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.