Lokesh CID Inquiry : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఢిల్లీ వెళ్లి నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు విచారణను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. లోకేష్ కేసులో విచారణను 10వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నిబంధనలను లోకేష్ హైకోర్టులో సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
తీర్మానాలు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని లోకేష్ ను అడగడం సమంజసం కాదని ఆయన తరఫు న్యాయవది పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు విన్నవించారు. డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని బుధవారం విచారణకు హాజరైన సీఐడీ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కేసును ఈ నెల 10కి వాయిదా వేస్తున్నట్లు ఆదేశించింది.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ ను చంద్రబాబు మార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్టారెడ్డి ఫిర్యాదు మేరకు గత ఏడాది ఐపీసీ, అవినీతి నిరోధక శాఖ చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య, రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటెజ్ ఫుడ్స్, రామక్రిష్ణ మౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలువురిని చేర్చింది.
సీఐడీ దాఖలు చేసిన మెమోలో నిందితుడిగా లోకేష్ పేరు చేర్చింది. ఏ14గా నారా లోకేష్ ను చేర్చి నోటీసులు జారీ చేసింది. దీంతో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారనే వదంతులు కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. దీనిపై లోకేష్ కూడా న్యాయపోరాటానికి దిగారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసులతో టీడీపీ నేతలను ఇరికిస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి.